జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది బాగోగులపై బల్దియా అధికారులు దృష్టిసారించారు. కొవిడ్-19 నేపథ్యంలో సిబ్బందికి ఒకపక్క కరోనా పరీక్షలు, మరోపక్క వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియను చేపడుతూనే వారికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వారికి మందులు, నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు.
యూసుఫ్గూడ సర్కిల్-19లో రెండు రోజుల కిందట కిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బందికి క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుబంధంగా సోమవారం యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలోని వైద్య సిబ్బందికి ఏఎంఓహెచ్ బిందు భార్గవి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పారిశుధ్య సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు, సర్కిల్లో మహిళా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిమ్స్ దవాఖాన సౌజన్యంతో 200 పారిశుధ్య సిబ్బందికి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు, ఈ సందర్భంగా నిర్వహించిన స్క్రీనింగ్లో ఒక మహిళను అనుమానాస్పదంగా గుర్తించి మెరుగైన చికిత్సనందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పారిశుధ్య సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నదని, కరోనా నేపథ్యంలో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల కుటుంబ సభ్యులకు లక్షణాలున్న కారణంగా పారిశుధ్య సిబ్బందిని హోమ్ క్వారంటైన్లో ఉంచినట్లు, ప్రయాణాలు చేసి వచ్చిన వారిని సైతం పరీక్షలు చేయించుకున్న అనంతరం విధుల్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు.