సికింద్రాబాద్, మార్చి 26: నిత్యం ప్రజలకు చేరువగా ఉంటు వారికి అనువైన విధంగా సేవలు అందించడం కోసం కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. సీతాఫల్మండిలోని నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సెట్విన్ భవన సముదాయాన్ని విడివిడిగా సెట్విన్ ఎండీ వేణుగోపాల్, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్లతో కలిసి గురువారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులకు సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్రస్గా మారిందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం సెట్విన్ కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. సీతాఫల్మండిలో వంద పడకల దవాఖానను నిర్మిస్తున్నామని తెలిపారు. సెట్విన్ ఎండీ వేణుగోపాల్ మాట్లాడుతూ కొన్ని నెలల కిందట మంత్రిగా ఉన్న పద్మారావు గౌడ్ సికింద్రాబాద్లో సిట్విన్ భవనం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు సాధ్యమయ్యే పనికాదని అనుకున్నానన్నారు. ఇప్పుడు చూస్తే అనేక వసతులతలో కూడి భవనం సిద్ధం అవుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉస్మానియా దవాఖాన సుపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి దవాఖానలు ఏర్పాటైతే పెద్దపెద్ద దవాఖానలకు రోగుల సంఖ్య భారీగా తగ్గిపోతుందని, తద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం అవకాశాలు ఉంటాయన్నారు.