హైదరాబాద్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన వ్యక్తిని నగరంలోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హఫీజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 20న ఇందిరానగర్కు చెందిన అనూష కమలాపురికాలనీలోని పొలిమేరాస్ కూరగాయలషాపులో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తోండగా వెనకనుంచి బైక్పై వచ్చిన ఓ దుండగుడు ఆమె మెడలోంచి గొలుసు లాక్కుని పారిపోయాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడిని పట్టించిన ఫొటో..
సంఘటనా స్థలంలో సీసీ ఫుటేజీలను పరిశీలించిన నిందితుడి ఆనవాళ్లు పసిగట్టారు. అయితే సీసీ ఫుటేజీలో స్పష్టత లేకపోవడంతో దారి పొడువునా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. స్నాచింగ్కు 20నిమిషాల ముందు టీవీ9 చౌరస్తాలో హెల్మెట్ లేకుండా బైక్పై వెళ్తున్న వ్యక్తికి చలానా విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు తీసిన ఫొటోలో ఉన్న వ్యక్తి చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తి ఒకటే అని గుర్తించారు. బైక్నెంబర్ ఆధారంగా నిందితుడు ఇందిరానగర్లో నివాసం ఉంటున్న జక్కుల వీరన్న(24) అనే వ్యక్తిగా తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు.
స్నాచింగ్ చేసిన గొలుసును ఇందిరానగర్లోని మణప్పురం ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన వీరన్న రూ.80వేలు తీసుకున్నాడు. దాంట్లో 27వేలతో అప్పులుతీర్చాడు. వీరన్న ఇచ్చిన సమాచారంతో మణప్పురంలో తాకట్టు పెట్టిన 3.2 తులాల బంగారు గొలుసును, రూ.53వేల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని గురువారం రిమాండ్కు తరలించారు.