‘మనం కుటుంబ సభ్యుల్లా భావించే వ్యక్తుల గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఈ వేడుకలో నేను అలానే ఫీలవుతున్నా. గత ఇరవై ఏళ్లుగా కీరవాణి, జక్కన్న కుటుంబాలను దేవుడిచ్చిన కుటుంబాలుగా భావిస్తాను’ అన్నారు ఎన్టీఆర్. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘తెల్లవారితే గురువారం’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మణికాంత్ దర్శకత్వం వహించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాలభైరవ సంగీతాన్నందించాడు. ఈ నెల 27న విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నా మంచి, చెడులు..కష్టాసుఖాల్లో.. జీవితంలో నేను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక కీరవాణి, జక్కన్న కుటుంబాలున్నాయి. పిల్లలు ఎదిగితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. సింహా, భైరవ విజయాల్ని చూసి కీరవాణి ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది. ఇక పేరెంటింగ్ విషయంలో నేను రమా రాజమౌళి, వల్లి నుంచి ఎంతో నేర్చుకుంటాను. తమ పిల్లల్ని అందరు గర్వించేలా వాళ్లు తీర్చిదిద్దడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సింహా, భైరవ కెరీర్లో మరో మెట్టులా ఉపయోగపడాలని కోరుకుంటున్నా’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ ‘ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఇంట్లో వాళ్లు ఏం చేసినా బాగుందనిపిస్తుంది కాబట్టి సినిమా గురించి ప్రేక్షకులే చెప్పాలనుకుంటున్నా. సినిమా చాలా రిచ్గా అనిపిస్తోంది. నిర్మాతలు మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీశారు. తొలి సినిమా అయినప్పటికీ దర్శకుడు కాన్ఫిడెంట్తో హ్యాండిల్ చేశాడు’ అని అన్నారు.