మహారాష్ట్రలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు
అధికారులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమావేశం
రోజూ 2 వేల పరీక్షలు.. 71 ప్రభావిత గ్రామాలు
పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారు హోం ఐసొలేషన్
ఆదిలాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహారాష్ట్రలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లావాసులు మహారాష్ట్రకు వెళ్లవద్దని సూచిస్తూ.. సరిహద్దులో ఉన్న 71 ప్రభావిత గ్రామాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టారు. కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. జిల్లాలో నాలుగైదు రోజులుగా రోజూ 35 నుంచి 40 కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం 2 వేల మందికి నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు హోం ఐసొలేషన్లో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రెండు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నవి. ఇప్పటివరకు 5,672 కేసులు నమోదుకాగా.. ఇందులో 5,251 మంది వైరస్ బారన పడి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 327 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజూ 35-40 కేసులు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు బస్సులు, రైళ్లు నడుస్తున్నాయి. వ్యాపారాలు, బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వస్తుంటారు. మహారాష్ట్రలో కరోనా ఉధృతి బాగా ఉండడంతో పక్క రాష్ర్టానికి పోయివచ్చిన వారి నుంచి వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల భీంపూర్ మండలంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు బయట ఇష్టానుసారంగా తిరుగుతుండడంతో కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యా రు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
పకడ్బందీ చర్యలు
ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. జైనథ్, బేల, తాంసి, తలమడుగు, గాదిగూడ మండలాల్లోని సరిహద్దున ఉన్న 71 ప్రభావిత గ్రామాలను గుర్తించి ప్రజలకు కరోనా నివారణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలకు చెందిన గ్రామాలకు చెందిన వారు మహారాష్ట్రకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. మహారాష్ట్రకు పోయివచ్చిన వారు హోం ఐసొలేషన్లో ఉండాలని, వ్యాధి లక్షణాలు కనపడితే నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని కోరుతున్నారు. బాధితులను ప్రాథమిక దశలో గుర్తించి వారికి చికిత్సలు అందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా రోజూ 2 వేల ర్యాపిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున రెండు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు తప్పనిసరి మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు. వ్యాపారులు తమ దుకాణాల్లో కరోనా నివారణలో భాగంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.