కొడంగల్, మార్చి17: చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఎన్హెచ్ 163 హైవేకు కిలోమీటరు దూరంలో చిన్ననందిగామ గ్రామం ఉంది. అప్పట్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు.. మురుగు నీటితో నిండుకున్న రోడ్లు కనిపించేవి. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ స్వరూపం పూర్తిగా మారిపోయింది. స్వచ్ఛతతో కూడుకున్న అభివృద్ధితో ముందుకు సాగుతున్నది. చిన్ననందిగామ, బుర్జుగాన్పల్లి రెండు గ్రామాలు కలిపి పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో మొత్తం 1565 మంది జనాభా, 1004 ఓట్లు, 319 కుటుంబాలు ఉన్నాయి. గ్రామానికి నీటి సరఫరా కోసం 20 వేలు, 30 వేల సామర్థ్యం గల రెండు మిషన్ భగీరథ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడంతో నీటి సమస్య పరిష్కారమైంది. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఏదైనా అంతరాయం ఏర్పడితే అత్యవసర పరిస్థితుల్లో సరఫరా చేసేందుకు బోర్లు కూడా ఏర్పాటుచేశారు. గ్రామ చిరకాల కోరికగా ఉన్న బీటీ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే మంజూరు చేసి, పనులు పూర్తిచేసి రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. దీంతో గ్రామంలో పారిశుద్ధ్యంపై అందరికీ అవగాహన వచ్చింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు.
ప్రతి నెలా రూ.లక్షా 82వేల నిధులు
పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీకి ప్రతి నెలా రూ.లక్షా 82వేల నిధులు మంజూరవుతున్నాయి. వాటి ద్వారా పంచాయతీ సిబ్బంది వేతనాలు, కరెంటు బిల్లు, మొక్కల సంరక్షణ మెయింటెనెన్స్, తాగునీటి పైప్లైన్ల మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ సావిత్రమ్మ తెలిపారు.
రూ.80లక్షలతో అభివృద్ధి పనులు
గ్రామానికి రెండేండ్లుగా దాదాపు రూ.80లక్షలపైగా నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.47లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, రూ.12.50లక్షలతో వైకుంఠధామం, రూ.2.50లక్షలతో కంపోస్టు షెడ్, రూ.9.50లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, డోజర్, నీటి ట్యాంకర్ కొనుగోలు, రూ.4లక్షలతో గ్రావెల్ పనులు, డంపింగ్యార్డ్తో పాటు పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు చేశారు.
నాడు మురుగు స్థలం.. నేడు పచ్చటి పార్కు
గ్రామానికి నడి బొడ్డున, నివాస స్థలాల మధ్య పెద్ద గుంతతో పాటు మురుగు నిండి నిరుపయోగంగా ఉండేది. మట్టితో పూడ్చివేసి, అక్కడ పల్లె ప్రకృతివనం ఏర్పాటుచేశారు. 13 గుంటల స్థలంలో 24 రకాల 750 మొక్కలు, వాకింగ్ ట్రాక్తో పల్లె ప్రకృతివనం ఏర్పాటుచేశారు. ప్రతి రోజూ మొక్కలకు నీటిని అందిస్తూ పచ్చటి వాతావరణాన్ని కాపాడుతున్నారు. ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో పార్క్ ఏర్పాటుచేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నర్సరీలో 5వేల మొక్కల పెంపకం
గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో ప్రస్తుతం 5వేల మొక్కలు పెంచుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. పొలాల్లో నాటేందుకు 6వేల మొక్కలు రైతులకు పంపిణీ చేశారు. గ్రామంలోని రోడ్ల ఇరువైపులా మొక్కలు నాటడంతోపాటు ప్రతి ఇంటి ఆవరణలో పెంచేందుకు 2 వేలు, మొత్తం 8వేల మొక్కలు పంపిణీ చేశారు.
పల్లె ప్రగతితో అభివృద్ధి జోరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాభివృద్ధి సాధ్యమైంది. నేడు వీధుల్లో చెత్త, మురుగు లేకుండా సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో స్వచ్ఛ గ్రామంగా ఏర్పడింది. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న గుంత నేడు పల్లె ప్రకృతి వనంలా మారింది. గ్రామంలో మురుగు కాల్వలు లేక ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది.