న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. తమ బైకుకు బైకు తగిలిస్తూ వెళ్లారన్న కోపంతో ఒకబైకుపై వెళ్తున్న ఇద్దరు యువకులు మరో బైకుపై వెళ్తున్న ఇద్దరు యువకులను వెంటపడి దారుణంగా హత్యచేశారు. ఔటర్ ఢిల్లీలోని పశ్చిమ విహార్ ఏరియాలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఇద్దరు యువకులు కత్తిపోట్లతో పడివున్నారంటూ స్థానికులు ఇచ్చిన సమాచారం పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ ఇద్దరూ అప్పటికే మృతిచెందారని వైద్యులు ధృవీకరించారు.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రోహిత్ అగర్వాల్ (23), ఘన్శ్యామ్ (20) అనే ఇద్దరు యువకులు బైక్పై వెళ్తూ ప్రదీప్ కోహ్లీ (19), మరో యువకుడు కలిసి వెళ్తున్న బైకును స్వల్పంగా ఢీకొట్టారు. దాంతో ప్రదీప్ కోహ్లీ అతని మిత్రుడు వారితో గొడవకు దిగారు. ఈ పరిణామంతో భయపడిపోయిన రోహిత్, ఘన్శ్యామ్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్తుండగా ప్రదీప్, అతని మిత్రుడు వారిని వెంబడించారు.
అర కిలోమీటర్కు పైగా చేజ్ చేసి చివరికి ఉద్యోగ్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో వారిని దొరికించుకున్నారు. ఆ వెంటనే కత్తులు తీసి ఇద్దరినీ విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి జారుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.