20 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో నిర్మాణం
20 పడకలతో రైతుల విశ్రాంతి గది
క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్
విశాలమైన సమావేశ మందిరం
మంత్రి కేటీఆర్ చొరవతో వేగంగా పనులు
రాజన్న సిరిసిల్ల, మార్చి 12 (నమస్తేతెలంగాణ) : మొన్నటిదాకా రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటలను అమ్ముకునేందుకు అరిగోస పడేది. సరైన మార్కెట్ సౌకర్యం ఉండకపోయేది. మద్దతు ధర రాకుంటే దాచుకునేందుకు గోదాములు లేకపోయేవి. కనీస సౌకర్యాలు లేని యార్డుల్లో అన్నదాతలు వడ్ల కుప్పలపైనే నిద్రించాల్సిన దుస్థితి ఉండేది. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. మద్దతు ధరతో ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర సర్కారు, ఆధునిక హంగులతో వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్మిస్తున్నది. సిరిసిల్ల జిల్లాకేంద్రం శివారులోని సర్దాపూర్లో 20 కోట్ల వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా యార్డు రూపుదిద్దుకుంటున్నది. 20 పడకలతో రైతు విశ్రాంతి గృహం, జిల్లా మార్కెటింగ్ శాఖ అడ్మినిస్ట్రేటివ్ భవనాలతో త్వరలోనే అందుబాటులోకి రానున్నది.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అడుగడుగునా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. గోదావరి జలాలను తీసుకొచ్చి బీడు భూములకు ప్రాణం పోసింది. పంట పెట్టబడి కింద ఎకరాకు ఏడాదికి పది వేలు చెల్లించడమే కాకుండా ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తూ అండగా నిలుస్తున్నది. పల్లెపల్లెనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రవాణా ఇబ్బందులు తొలగించింది. గోదాములను కట్టించింది. ఇప్పుడు ఆధునిక హంగులతో మార్కెట్ యార్డులను అందుబాటులోకి తెస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారి పక్కనే సర్దాపూర్లో ఆధునిక హంగులతో 25 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ యార్డును నిర్మిస్తున్నారు. 20 కోట్లు మంజూరు కాగా, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పనులు వేగంగా జరుగుతున్నాయి. యార్డులో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలను నిలువ చేసుకునేలా రెండు గోదాములను నిర్మించారు. వర్షాలకు ధాన్యం తడువకుండా ఉండేందుకు 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మూడు కవర్ షెడ్లను నిర్మించారు. ఇందులో ధాన్యం ఆరబోసుకునే వీలుంటుంది.
రైతులకు విశ్రాంతి గదులు..
మార్కెట్కు వచ్చిన రైతుల కోసం విశ్రాంతి గృహం నిర్మించారు. 20 పడకల సామర్థ్యంతో గదులు నిర్మించగా, అందులో ఫ్యాన్లు, కరెంటు, మంచినీళ్లు, మరుగుదొడ్లు, క్యాంటీన్ వంటి అన్ని వసతులు కల్పిస్తున్నారు. యార్డులో సేద తీరేందుకు ఉద్యాన వనాలు నిర్మిస్తున్నారు. వాహనాల రాకపోకలకు వేర్వేరుగా ముఖద్వారాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖకు ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనం, దీనిపైన నాలుగు దిక్కులా కనిపించేలా వాచ్టవర్, మార్కెట్ యార్డు పాలకవర్గం సమావేశాలకు విశాలమైన భవనం నిర్మిస్తున్నారు. కమీషన్దారులకు 8, ట్రేడర్లకు 8 చొప్పున దుకాణాలు ఏర్పాటు చేశారు. విశాలమైన రహదారులకు ఇరువైపులా డివైడర్లు, మధ్యలో పూల మొక్కలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఉగాదిలోగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తున్నది.