కోల్కతా : నందిగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తనపై కొందరు దాడి చేశారని స్వయంగా మమతనే మీడియాకు వెల్లడించారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలోనూ కొందరు తన కారు డోర్ను బలవంతంగా నెట్టారని.. దీంతో తాను లోపలోనే ఉండి పోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తనపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఘటనాస్థలంలో ఒక్క పోలీస్ కూడా లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని మమత బెనర్జీ అన్నారు.
దాడిలో తన కాలికి గాయమైందని, ఛాతీనొప్పి సైతం తనను తీవ్రంగా బాధిస్తున్నదని వెల్లడించారు. తాను నందిగ్రామ్ నుంచి కోల్కతా వెళ్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మమత వ్యాఖ్యలను ఖండించారు. మమతా బెనర్జీ దాడి పేరుతో సానుభూతి సంపాదించేందుకు డ్రామా లాడుతుందని అన్నారు. ఘటనపై అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తృణమూల్ అధినేత్రిపై దాడి ఘటనపై ఆ పార్టీ శ్రేణులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.