బ్రసీలియా: బ్రెజిల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడ రోజువారీగా నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు కేవలం 24 గంటల వ్యవధిలో 1,641 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రెజిల్ సర్కారు దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రమైందని మంగళవారం రాత్రి ప్రకటించింది.
దేశంలో పరిస్థితి మరింత విషమించకుండా ఉండాలంటే తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని బ్రెజిల్ ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాలని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విస్తృతితో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో 80 శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయని తెలిపారు. కాగా, తాజా మరణాలతో కలిపి బ్రెజిల్లో కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 2,57,361కి చేరింది.