ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజుల నుంచి పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో.. ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే పుణెతో పాటు మరో ఏరియాలో నైట్ కర్ఫ్యూ విధించారు. కొన్ని గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. జన సమూహాలు లేకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే గతేడాది కరోనా వ్యాప్తి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 26 మంది మంత్రులకు కరోనా సోకింది. గత నెల రోజుల్లో ఏడుగురు మంత్రులకు కరోనా వ్యాపించింది. 26 మంది మంత్రుల్లో అత్యధికంగా ఎన్సీపీకి చెందిన వారు 13 మంది ఉన్నారు. మిగతా 13 మంది మంత్రుల్లో ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, ఐదుగురు శివసేనకు చెందిన వారు, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు.
ఇటీవల కరోనా సోకిన ఏడుగురు మంత్రుల్లో అనిల్ దేశ్ముఖ్, రాజేంద్ర షింగ్నే, జయంత్ పాటిల్, రాజేశ్ తోపే, సతేజ్ పాటిల్, బచ్చు కదూ, ఛగన్ భుజ్బల్ ఉన్నారు.