అర్హులందరికీ టీకా వేయాలి
పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 222 బృందాలతో వ్యాక్సినేషన్
పూర్తయిన ప్రతి ఇంటికీ స్టిక్కర్ అతికించాలి
వైద్యులు నిరంతరం పర్యవేక్షించాలి
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి, సెప్టెంబరు 19(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా ఉద్యమంలా కొవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ టీకా వేయాలని వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. టీకా పూర్తయిన ప్రతి ఇంటికీ వ్యాక్సినేషన్ స్టిక్కర్ అతికించాలని నిర్దేశించారు. జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్పై ఆదివారం కరీంనగర్లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. ప్రతీ గ్రామం, వార్డు పరిధిలో టీకా కేంద్రాల నిర్వహణపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాక్సినేషన్తో ఎలాంటి ప్రాణాపాయం ఉండదనే విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాలని కోరారు. జిల్లాలో గర్భిణులకు టీకా తీసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని అపోహలను తొలగించాలని సూచించారు. శిబిరాల వద్ద అవసరమున్న మందులను అందుబాటులోకి తీసుకోవాలన్నారు. డాక్టర్లు పర్యవేక్షించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 100 శాతం 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు 222 (118 పట్టణ, 104 గ్రామీణ) బృందాలతో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో దాదాపు 5.5 లక్షల మందికి పైగా ప్రజలు 18 ఏండ్లు పైబడిన వయస్సు వారు ఉన్నారని, వీరిలో 4,51,138 మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. సెప్టెంబరు 17 నుంచి చేపడుతున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రతీ రోజు 13 వేల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. జిల్లాలో ఐకేపీ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలతో బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసుకోని వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నవారి ఇళ్లకు స్టిక్కర్లు వేస్తున్నట్లు ఆమె వివరించారు. వీసీలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనీల్కుమార్, పెద్దపల్లి, మంథని మున్సిపల్ చైర్ పర్సన్లు చిట్టిరెడ్డి మమతరెడ్డి, పుట్ట శైలజ, బల్దియా కమిషనర్లు ఉన్నారు.