వచ్చే సీజన్లో దొడ్డు వడ్లు కొనదట
బీజేపీ సర్కారు విధానాలతో కర్షకులకు తీరని అన్యాయం
రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిపెట్టాలి
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 19: నల్లచట్టాలు తేవడమే కాదు దొడ్డు వడ్లు కొనబోమంటూ రైతుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ధాన్యం నిల్వల పేరుతో కొనుగోలు తప్పించుకోవాలని చూస్తున్నదని, బీజేపీ సర్కారు విధి విధానాలతో అన్నదాతలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్ మండలం తాహెర్ కొండాపూర్లో రూ. 20లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కొండాపూర్ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు ధాన్యాన్ని కొనబోమని చెబుతున్నదని.. ఈ క్రమంలో రైతాంగం నష్టపోకుండా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నదని, రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు నాణ్యమైన కరెంట్, నీరు, పెట్టుబడి సాయం అందించడం, ఇతర మౌలిక వసతుల్ని కల్పించే అధికారం మాత్రమే ఉందని, పండిన పంటను సేకరించడం, నిల్వ చేయడం, మార్కెటింగ్ చేయడం, ఎగుమతి చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కృషితో గ్రామాల్లో సమృద్ధిగా నీరు, ఉచిత కరెంట్ అందుబాటులోకి వచ్చాయని వివరించారు. రైతులు ఇప్పుడిప్పుడే పంటలు బాగా పండిస్తున్నారని, కేంద్రం ఇలా అంటే ఏం చేసేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం నిల్వల సాకుతో మన రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తున్నదని, ఈ క్రమంలో రైతులు వరి కాకుండా మిగతా పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు.
దొడ్డు వడ్లు కాకుండా నూనె గింజలైన ఆయిల్పామ్, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఇతర వాణిజ్య పంటలు, పత్తి, కంది, చిరుధాన్యాలు సాగు చేయాలని సూచించారు. వచ్చే సీజన్లో దొడ్డు వడ్లు కొనుగోలు చేసేలా సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారన్నారు. వరికి బదులు ఇతర పంటలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారా..? అంటూ రైతులను ప్రశ్నించారు. ఒకవేళ యాసంగిలో దొడ్డు వడ్లు కాకుండా సన్న రకాలు వేస్తారా? అని అడిగి తెలుసుకున్నారు. రైతుల అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అతి త్వరలోనే వ్యవసాయాధికాలు, శాస్త్రవేత్తలతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించి ఇబ్బందులు తొలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ సర్పంచ్ మడికంటి మమత, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత శ్రీనివాస్, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతిగౌడ్, ఉపసర్పంచ్ గోస్కుల శంకరయ్య, కరీంనగర్ సింగిల్ విండో డైరెక్టర్లు గంట శంకరయ్య, మడికంటి మారుతి, సుంకిశాల సంపత్రావు, కూర నరేశ్రెడ్డి, చింత లక్ష్మణ్, కూర శ్యాంసుందర్ రెడ్డి, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, దుర్ర మురళి, కనవేణి శ్రావన్, రాజు, ఆకుల నవీన్, పురెళ్ల రాజు, మంద రాజమల్లు, తహసీల్దార్ నల్ల వెంకట్రెడ్డి, పీఆర్ ఏఈ రమణ, వ్యవసాయ అధికారి సత్యం ఉన్నారు.