దశా దిశ మార్చే పథకం ప్రకటనపై దళితుల ఆనందహేల
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు
హుజూరాబాద్ నియోజకవర్గంలో అంబరాన్నంటిన సంబురాలు
ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధుల ర్యాలీలు
ముఖ్యమంత్రికి మనసారా కృతజ్ఞతలు
అమాత్యులు కొప్పుల, గంగుల, ఎమ్మెల్యేలు సతీశ్, సుంకె, రమేశ్, ఎమ్మెల్సీలు పల్లా, నారదాసు హాజరు
కరీంనగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ)/జమ్మికుంట/హుజూరాబాద్ టౌన్/ హుజూరాబాద్ రూరల్/వీణవంక/ ఇల్లందకుంట/ కరీంనగర్ కార్పొరేషన్ : దళితలోకం మురిసింది.. దళితబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఆనందంలో మునిగిపోయింది.. చారిత్రాత్మక తెలంగాణ దళిత బంధు పథకానికి హుజూరాబాద్ సెగ్మెంట్ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం, ఇక్కడి నుంచే పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పడంపై పండుగ చేసుకుంటున్నది.. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు జరుపుకున్నది. ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పల్లె పట్టణం అనే తేడా లేకుండా సంబురాల్లో మునిగితేలింది. అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసింది. ఆయాచోట్ల వేలాది మందితో భారీ ర్యాలీ తీసి, దారి పొడవునా “జై కేసీఆర్” “జైజై కేసీఆర్” నినాదాలతో హోరెత్తించింది. దేశ చరిత్రలోనే ఇంతటి గొప్ప కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం మరిచిపోలేమని, మా దళితులమంతా జీవితాంతం సర్కారుకు రుణపడి ఉంటామని స్పష్టం చేసింది.
దళితుల దశా, దిశ మార్చే తెలంగాణ దళిత బంధు పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని.. తొలుత హుజూరాబాద్ సెగ్మెంట్ కేంద్రంగానే ప్రారంభిస్తామనే సీఎం కేసీఆర్ ప్రకటనపై దళితుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆనందంలో మునిగిపోయారు. ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా హోరెత్తించారు.
హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సతీశ్కుమార్ హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గంగుల డప్పు కొట్టి చిందేశారు. అనంతరం గద్దెపై ఎక్కి భారీ టీఆర్ఎస్ జెండాను పట్టుకుని ఊపుతూ ఉత్సాహం నింపారు. కాగా, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన మహిళల కోలాట బృందాలు, డప్పు కళాకారులు నృత్యాలు ఆకట్టుకోగా, కరీంనగర్కు చెందిన పలువురు మహిళా కార్పొరేటర్లు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, మహిళ కౌన్సిలర్లు కోలాటమాడారు. దొంత రమేశ్ యువసేన కార్యకర్తలు, అభిమానులు చౌరస్తాలో భారీ హోర్డింగ్ పైకి ఎక్కి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడంతో అక్కడున్న వారంతా ‘జై టీఆర్ఎస్.. కేసీఆర్ జిందాబాద్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అలాగే కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్ పూలమాల వేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన వెంట మేయర్ సునీల్రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, ఎంపీటీసీ తిరుపతినాయక్, నాయకులు అర్ష మల్లేశం, శ్యాం, మహేశ్ ఉన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ హుజూరాబాద్ మండలం చెల్పూర్లో అంబేద్కర్, సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హాజరయ్యారు. మోత్కులగూడెం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం 4వేల మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, దళితులతో కలిసి డప్పు, డోలు చప్పుళ్లతో తెలంగాణ చౌక్ దాకా భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరపల్లి వెంకటేశ్వర్లపల్లి జంక్షన్ వద్ద అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామ ప్రజలు, నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం డప్పు కొడుతూ నృత్యం చేస్తూ నాయకుల్లో ఉత్సాహం నింపారు.
ఇల్లందకుంటలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి దళిత సంఘాల నాయకులు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ డప్పు కొడుతూ ఉత్సాహపరిచారు. మహిళలు బతుకమ్మ ఆడగా, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ సహా పలువురు స్టెప్పులు వేశారు.
వీణవంక మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో దళిత నాయకులు, టీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, అంబేద్కర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయగా, బస్టాండ్ ప్రాంతమంతా “జై కేసీఆర్, జైజై టీఆర్ఎస్’ నినాదాలతో హోరెత్తించారు.
కుటుంబాలు బాగుపడుతయి..
దళితుల అభివృద్ధి కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ కృషి చేయలేదు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాత్రమే దళితుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నరు. చదువుకున్న యువకులు, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన కుటుంబాలకు తెలంగాణ దళిత బంధు పథకం అండగా నిలుస్తుంది. ఈ పథకంతో ఎన్నో పేద కుటుంబాలు బాగుపడుతయి. దళితులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటరు.
ఇవాళ పండుగ రోజు..
దళిత బంధు పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదు. కుటుంబాల ఆర్థిక ఎదుగుదలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ నిజంగా మా అందరికీ పండుగ రోజే. దళితుల కోసం మంచి పథకాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్కు మా ధన్యవాదాలు. కష్టాలు తీరే రోజులు వచ్చినయ్.
మాకు మహా వరం..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధువు ఒక గొప్ప వరం లాంటిది. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల కేటాయించి కుటుంబ సమగ్రాభివృద్ధికి చేయూతనిస్తున్నరు. సీఎం కేసీఆర్కు దళిత కుటుంబాలు రుణపడి ఉంటయి. ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు కేటాయించి.. దమ్మున్న ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ నిలిచిపోతరు. దళితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దళితులంతా అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటం.
అండగా ఉంటం..
దళితుల ఆర్థిక స్వావలంబనకు సీఎం కేసీఆర్ మొదటి బీజం వేసిండు. అంబేదర్ ఆశించిన విధంగా దళితవాడలో అభివృద్ధి నిజమైన అభివృద్ధిగా సీఎం కేసీఆర్ గుర్తించిండు. దళితుల కోసం 10 లక్షలు ఇస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. దళిత యువతీయువకులు స్వయం ఉపాధి పొందేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అడుగకుండానే సాయం చేస్తున్న సీఎం కేసీఆర్కు మేమంతా అండగా ఉంటం. టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తం.
– మైస శ్రావణ్ కుమార్,విద్యార్థి, బండఅంకూస్వాడ, (హుజూరాబాద్ టౌన్)
దేశంలోనే గొప్ప పథకం..
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజలకు అందిస్తున్నరు. దళితుల కోసం దళిత బంధు పథకాన్ని తేవడం అభినందనీయం. దళిత కుటుంబాల ఎదుగుదలకు పథకం ఎంతగానో దోహదపడుతుంది. ఎంతో మంది నిరుద్యోగ యువకులు సరైన పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నరు. ప్రభుత్వం సాయం చేయడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది.