వీణవంక, అక్టోబర్ 17: తెలంగాణ వచ్చినంక టీఆర్ఎస్ సర్కారు రైతుల బాధలను అర్థం చేసుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. వానకాలం పండిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందవద్దు. రైతును రాజును చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. కేంద్రంలోని బీజేపీ మాత్రం న్యాయం చేయాలని అడిగిన రైతులపై కార్లు ఎక్కించి సంపుతున్నది. రైతును కడుపులో పెట్టుకొని సాదుకునేటోళ్లు కావాల్నా..? లేక కార్లు ఎక్కించి సంపెటోళ్లు కావాల్నా.. మీరే ఆలోచించాలె. ఈటల తన తప్పులను ప్రజలపై రుద్దాలని చూస్తున్నడు. నా పైనా లేనిపోని మాటలు మాట్లాడుతున్నడు. రాజేందర్ గెలిస్తే బీజేపీకి లాభం.. గెల్లు గెలిస్తే నియోజకవర్గానికి లాభమని గుర్తుంచుకోండి. ఈటల ఝూటా మాటలు నమ్మకండి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం టీఆర్ఎస్ను గెలిపించండి. ధరలు తగ్గాలంటే ఈ నెల 30న జరిగే ఎన్నికలో నెంబర్ 2 కారు గుర్తుకు ఓటేయండి.ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటం.
ఈటలకు పేదలపై ప్రేమలేదు
బీజేపీ అభ్యర్థి ఈటలకు హుజూరాబాద్ నియోజకవర్గ పేదలపై ప్రేమ లేదు. దయా దాక్షిణ్యాలు అసలే లేవు. టీఆర్ఎస్ ఇచ్చిన పదవులను ఆయన స్వార్థం కోసం వాడుకున్నడు. ధరలు పెరిగినా, సామాన్యులకు భారమైనా ఫరవా లేదు, తాను మాత్రం గెలవాలనే స్వార్థంతో కనిపిస్తున్నడు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానించి పంపితే కేంద్రం తిరిగి పంపింది. దీనిపై ఈటల ఎందుకు స్పందించరు?. గ్యాస్ ధరల పన్ను విషయంలో నేను విసిరిన సవాల్పై ఇంత వరకు స్పందించలేదు. ఎందుకంటే ఆయన అబద్ధమాడిండు. కాబట్టే ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగ అయ్యింది. టీఆర్ఎస్పేదల పార్టీ. గెల్లు సీనును ఆశీర్వదిస్తే హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకుంటం.
రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకునేటోళ్లు కావాల్నా.. కార్లతో తొక్కించి సంపేటోళ్లు కావాల్నో..? ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. వీణవంక మండలంలోని మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎలుబాక, గంగారం, కొండపాక, శ్రీరాములపేట, కిష్టంపేట గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి పాల్గొన్న మంత్రికి ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ముద్దసాని దామోదర్రెడ్డి స్వగ్రామం మామిడాలపల్లి గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈటల రాజేందర్ తనకేదో అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాడని, ఆనాడు దామోదర్రెడ్డి మీద ఈటల గెలిచాడంటే సీఎం కేసీఆర్ ఇచ్చిన టికెట్, కారు గుర్తు చూసి ఓటు వేశారని మరిచిపోవద్దని అన్నారు. పేద ప్రజలకు, రైతులకు ఏం చేస్తాడో ఈటల మాత్రం చెప్పడం లేదని విమర్శించారు. ఫేక్ వీడియోలు, సోషల్ మీడియాను నమ్మకుండా న్యాయం, ధర్మం వైపు నిలబడి.. మనకోసం ఎవరు కష్టపడతారో ఆలోచించాలని యువకులను కోరారు. మామిడాలపల్లి బ్రిడ్జి కోసమో, హుజూరాబాద్ జిల్లా కావాల్ననో ఈటల రాజీనామా చేయలేదని, ఆస్తులను కాపాడుకునేందుకు రాజీనామా చేశాడని స్పష్టం చేశారు.
రాజేందర్ గెలిస్తే బీజేపీకి, గెల్లు గెలిస్తే నియోజకవర్గానికి లాభం జరుగుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుంటే, ఈటల విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ కిట్టు, రైతుబంధు లాంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమని, కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు ఆపలేదని గుర్తు చేశారు. రైతుబంధు దండుగ అని ఈటల రాజేందర్ అంటున్నాడని, అలాంటి వ్యక్తికి ఓటెందుకు వేయాలో రైతులు ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల జీతాలు కోసి రైతుబంధు వేశామని, ఈటల కూడా రైతుబంధు కింద రూ.10 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. రైతు చనిపోతే 11 రోజుల్లోపు రైతుబీమా అందుతున్నదని పేర్కొన్నారు.
బావుల దగ్గర మీటర్లు పెడుతామని బీజేపీ అంటున్నదని, సీఎం కేసీఆర్ మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదని తెలిపారు. డీజిల్ ధర పెంపుతో రైతులపై ఏటా ఎకరాకు రూ.2500 భారం పడుతున్నదని, పది రోజుల్లో ఏడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని పేర్కొన్నారు, కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల బతుకులు చీకటిమయం అవుతాయని మాట్లాడిన ఈటల రాజేందర్, ఆయన బాగుండాలని బీజేపీలో చేరారని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ గురించి ఈటల రాజేందర్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని మండిపడ్డారు. ఈ నెల 30న పోలింగ్ కేంద్రానికి బయల్దేరే ముందు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకోవాలని, ఆ తర్వాత ఓటు కారు గుర్తుకు వేస్తే, ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకత్వానికి ఈ సెగ తగులుతుందన్నారు. జనరేటర్లో డీజిల్ అయిపోతే తనపై నెపం నెడుతున్నాడని విమర్శించారు. ఈటల ఒక్క మహిళా భవనం కూడా కట్టలేదని, ప్రతి గ్రామానికీ మహిళా భవనం కట్టించే బాధ్యత తనదని తెలిపారు. గెల్లును గెలిపిస్తే మీ దగ్గరే ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తాడని తెలిపారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్కు మనమంతా అండగా నిలువాలని కోరారు. ఆయన చేపట్టిన పథకాలతో అన్ని వర్గాల్లో ఆత్మగౌరవం నిండిందని పేర్కొన్నారు. గోడ గడియారాలు, కుక్కర్లు, కుంకుమ భరిణెలు, బొట్టుబిళ్లలు పంచి ఆత్మగౌరవం అంటూ ఈటల ఝూటా మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిస్తే ప్రతి పదిహేను రోజులకోసారి మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఈటల రాజేందర్కు అవకాశం ఇస్తే ఒక్క ఇల్లు కట్టించలేకపోయాడని, గెల్లుకు అవకాశమిస్తే 5 వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. 90 శాతం ఓట్లు టీఆర్ఎస్కు వేస్తే మామిడాలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, వచ్చేనెల 17 తేదీ వరకు గ్రామ పంచాయతీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని తెలిపారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మొసలి కన్నీళ్లు నమ్మొద్దు : గెల్లు శ్రీనివాస్ యాదవ్
బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరుగుతూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని.. వారి మాటలు నమ్మి మోసపోవద్దని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. రైతులు గతంలో ఎన్నో కష్టాలు పడ్డారని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడున్నరేండ్లలో కాళేశ్వరం జలాలను గ్రామాలకు తీసుకువచ్చి కష్టాలను తీర్చారని తెలిపారు. రాజేందర్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏంచేశాడని, కల్యాణలక్ష్మి, రైతుబంధుతో మన కడుపునిండదని అంటున్నాడని ధ్వజమెత్తారు. ఈటల స్వార్థం కోసం ఎన్నికలు తీసుకువచ్చాడని, హుజూరాబాద్ నియోజకవర్గంపై చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ దగ్గర మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకునేవాడు కాదని మండిపడ్డారు. వీణవంకకు సెంట్రల్ లైటింగ్, అధునాతన లైబ్రరీ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. పేదింటి బిడ్డనైన తనను సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపారని, మీరు గెలిపిస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, సింగిల్విండో మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి, సర్పంచులు బండ సుజాత, కాంతారెడ్డి, పింగిలి కోమల్రెడ్డి, ఆవాల అరుంధతి, బండారి ముత్తయ్య, నీల కుమారస్వామి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి, వైస్ఎంపీపీ రాయిశెట్టి లత, ఎంపీటీసీలు ఎలవేన సవిత, మూల రజిత, నల్ల మమత, సంగ స్వరూప, ఓసీ జేఏసీ సామాజిక సంఘాల అధ్యక్షుడు పొలాడి రామారావు, నాయకులు కిషన్రెడ్డి, పుల్లారెడ్డి, పొదిల రమేశ్, కుమార్, సదానందం, శ్రీదేవి, రాజ్కుమార్, శంకర్, డాక్టర్ మదన్మోహన్ ముదిరాజ్, దాసారపు ప్రభాకర్, చిన్నాల అయిలయ్య, గెల్లు మల్లయ్య, నీల కుమార్, ప్రకాశ్, దాసారపు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.