ఏం చేయాలో తెలియక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నడు
పెంచిన ధరలు తగ్గించిన తర్వాతే ఓట్లు అడగాలి
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట పట్టణంలో విస్తృత పర్యటన
జమ్మికుంట రూరల్, అక్టోబర్ 17: బీజేపీ నేత ఈటలకు ఓటమి భయం పట్టుకున్నదని, ఏం చేయాలో తెలియక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలోని 17వ వార్డులో ముస్లింలు నిర్వహించిన సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి హాజరయ్యారు. సమస్యలపై చర్చించారు. ముస్లింలు టీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జమ్మికుంట పట్టణంలోనూ సమావేశం నిర్వహించారు. ఆయా చోట్ల మాట్లాడారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు మంత్రిగా పనిచేసి కూడా ఈటల చేసిందేమీ లేదని, కనీసం ప్రజా సమస్యలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఐదేళ్లు పదవిలో ఉండాలని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారిని మోసం చేసి బీజేపీలో చేరాడని దుయ్యబట్టారు. తాము వచ్చాకనే రూ.200కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్లో ఉన్న సమయంలో డబ్బులు ఇచ్చే సంస్కృతి ఆయనకు లేదని చెప్పిన ఈటల.. ఇవాళ కుట్టు మిషన్లు, బొట్టు బిళ్లలు ఎందుకు పంచుతున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 1600 ఓట్లు రాని బీజేపీ.. ఈ ఎన్నికలో ఈటలను ఒక పావుగా వాడుకుంటున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి 35లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, మరి బీజేపీని ఒప్పించి పెరిగిన ధరలు తగ్గించిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. దళితబంధుపై విషప్రచారాలు చేస్తున్నారని, దళిత సోదరులు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, వార్డు కౌన్సిలర్ జుగురు సదానందం, నాయకులు బత్తి శివశంకర్, వడ్లూరి మొగిళి, మంద రాజేశ్, శరత్, నగేష్ ఉన్నారు.
చిరు వ్యాపారులు అండగా ఉండాలి
పట్టణంలోని చిరువ్యాపారులు టీఆర్ఎస్కు అండగా ఉండాలని, గెల్లు శ్రీనివాస్ విజయానికి సహకరించాలని మంత్రి కొప్పుల కోరారు. రైల్వే స్టేషన్ సమీపంలో చిరువ్యాపారులతో ఆదివారం సమావేశమయ్యారు. వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీకి అండగా ఉండాలని కోరారు. జమ్మికుంట పట్టణంలోని 5, 16,17, 28 వార్డుల్లో మంత్రి పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అలాగే 5వవార్డుకు చెందిన చాంద్ బ్యాండ్ ఫ్రొప్రైటర్ ఇటీవల మృతిచెందగా, ఆయన కుటుంబానిన మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఆయా క్యాక్రమాల్లో వార్డు కౌన్సిలర్లు పిట్టల శ్వేత, కల్వల దీప్తి, కూతాడి రాజయ్య, జుగురు సదానందం ఉన్నారు.