కేసీఆర్, కేటీఆర్లను విమర్శించే స్థాయి షర్మిలకు లేదు
ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బస్వరాజ్ సారయ్య
హుజూరాబాద్ టౌన్, జూలై 17: ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో సమైక్య పార్టీలకు చోటు లేదని, సీఎం కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను విమర్శించే స్థాయి వైఎస్సార్సీపీ టీఎస్ వ్యవస్థాపకురాలు షర్మిలకు లేదని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. శనివారం సాయంత్రం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో మళ్లీ సమైక్య బీజాలు నాటేందుకు షర్మిల చేస్తున్న కుటీల ప్రయత్నాలు ఫలించవన్నారు. రాష్ర్టాన్ని ఐటీ రంగంలో దేశంలోనే ఆగ్రగామిగా నిలుపుతున్న మంత్రి కేటీఆర్ను హేలన చేసేలా మరోసారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పేర్లు చెప్పే అర్హత షర్మిలకు లేదన్నారు. ప్రజలకు ఎక్కడ లేనన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేస్తూ బంగారు తెలంగాణ కోసం పరితపిస్తున్న కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. పార్టీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్న ఏకైక పార్టీ దేశంలో టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. సమైక్యాంధ్రను కోరుకున్న వైఎస్సార్ ఆశయాలను ఇక్కడ నెరవేర్చాలనే కుట్రలో భాగంగానే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాష్ర్టాన్ని ఆగం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు.
కృష్ణ, గోదావరిపై ప్రాజెక్టులన్నీ రాత్రికి రాత్రే బోర్డుల పరిధిలోకి తెచ్చేలా గెజిట్ తెచ్చిన మోదీ సర్కార్కు రాష్ట్ర బీజేపీ నేతలు వత్తాసు పలకడం తెలంగాణ రాష్ర్టానికి చేస్తున్న అతిపెద్ద నమ్మక ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. చెరువులు, తూములు, కాలువలు బోర్డుల పరిధిలోకి తీసుకురావడంతో పాటు విద్యుత్ కేంద్రాలను స్వాధీనం చేసుకునేలా కుట్ర పన్నిన బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణలో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సారయ్య సూచించారు. ఈటల రాజేందర్ను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కుడి, ఎడమ భుజాలుగా కూర్చొబెట్టుకున్న సీఎం కేసీఆర్ను కాదని, బీజేపీలోకి పోయిన ఆయనను వారి పార్టీ సమావేశాల్లో ఎక్కడ కూర్చుండబెడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అలాంటి ఈటల ఆత్మగౌరవం అంటూ మాట్లాడితే ఆ పదమే సిగ్గు పడుతుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, పట్టణాధ్యక్షురాలు, కౌన్సిలర్ కల్లెపెల్లి రమాదేవి, కౌన్సిలర్ తాళ్లపెల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు భూసారపు బాబురావు, రాపర్తి శివ, ఎస్కే ఫయాజ్ పాల్గొన్నారు.