పత్తి విత్తనాలపై నిఘా
లూజ్ విత్తనాలు రాకుండా చర్యలు..
ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక టాస్క్ బృందాలు
ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు
అన్నదాతను మోసం చేసే వారిపై పీడీ యాక్టులు
కరీంనగర్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): లూజ్ పత్తి విత్తనాల దందాపై వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు నిఘా పెంచారు. తక్కువ ధరకు వస్తున్నాయని కొందరు రైతులు నిషేధిత హెర్బిసైడ్ టొలరెంట్ (హెచ్టీ) పత్తి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. గత నాలుగైదు సీజన్లలో ఈ తరహా విత్తనాలు జిల్లాకు విరివిగా వచ్చినట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఈసారి గట్టి నిఘా పెం చారు. గత నెల నుంచే ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు పోలీసుల సహకారంతో లూజ్, హెచ్ టీ విత్తనాలు రాకుండా అప్రమత్తమయ్యారు. ఇలాంటి విత్తనాలు అమ్మకుండా డీలర్లను కట్టడి చేసిన అధికారులు అన్ని ట్రాన్స్పోర్టు ఏజెన్సీలపై నిఘా పెంచారు. టాస్క్పోర్స్ బృందాలను ఏర్పా టు చేసి గ్రామాలపై దృష్టి సారిస్తున్నారు.
నేరుగా గ్రామాలకే దళారులు
వానకాలం వచ్చిందంటే నకిలీ విత్తనాలు లేదంటే ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు ఏదో రూపంలో జిల్లాకు చేరుతున్నాయి. ఏటా ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత అధికంగా పత్తి సాగువుతుండడంతో దళారులు తమ అక్రమ దందాకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. గ్రామాల్లో గుట్టుగా పర్యటిస్తూ రైతుల నుంచి ఆర్డర్లు తీసుకుని మరీ లూజ్ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఇప్పుడు మార్కెట్లో 450 గ్రాముల బీటీ-2 పత్తి విత్తనాలు, అనుబంధంగా మరో 120 గ్రాముల కంది లేదా నాన్ బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.730. కానీ, గ్రామాల్లో తిరుగుతున్న దళారులు లూజ్ విత్తనాలను రూ.550, రూ.600కే అమ్ముతున్నారు. తక్కువ ధరకే వస్తున్నాయని వీటిని కొనుగోలు చేస్తున్న రైతులు కొన్ని చోట్ల నిలువునా మోస పోతున్నారు. విత్తన దళారులు హెచ్టీ ఫార్ములా ఉన్న బీటీ-3 విత్తనాలను కూడా రైతులకు కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది.
రైతున్నలూ.. జాగ్రత్త
రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు సాగు చేస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఆధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనాలి. కొనుగోళ్లకు సంబంధించిన రసీదును తప్పని సరిగా తీసుకోవాలి. విత్తన లాట్ నంబర్, ఎక్స్పయిరీ తేదీ, విత్తన బిల్లులో రాశారా? లేదా చూసుకోవాలి. రసీదుపై రైతు సంతకం చేయాలి. ఆధీకృత డీలర్తోనూ తప్పనిసరిగా సంతకం తీసుకోవాలి. బీటీ-3 పేరిట విక్రయించే విత్తనాలపై రాష్ట్రంలో నిషేధం ఉన్నది. ఇలాంటి విత్తనాలు కొనరాదు. విత్తనాలు కొనేముందు రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవడం మంచిది. విత్తన ప్యాకెట్లపై ఉన్న ఎంఆర్పీకి మించి కొనవద్దు. విడి విత్తనాలు కొని మోసపోద్దు. నకిలీ విత్తన విక్రేతల వివరాలను 100కిగాని స్థానిక పోలీసులు, వ్యవసాయ అధికారులకుగానీ తెలియజేయాలి.
గ్రామాలపైనే ప్రధాన దృష్టి
ఉమ్మడి జిల్లాను ఏటా నకిలీ, అనుమతి లేని విత్తనాలు ముంచెత్తుతుండడంతో రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తోంది. విత్తన దళారులు ప్రధానంగా గ్రామాల్లోనే తమ దందా కొనసాగిస్తున్న నేపథ్యంలో అధికారులు అక్కడే దృష్టి సారిస్తున్నారు. గత నాలుగైదేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లూజ్ విత్తనాలు ఎవరెవరు విక్రయిస్తున్నారో వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల ద్వారా గతంలో ట్రాన్స్పోర్టు ఏజెన్సీలకు లూజ్ విత్తనాలు చేరిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇటు వ్యవసాయ శాఖ, అటు పోలీసు శాఖ టాస్క్ఫోర్స్ బృందాలు ట్రాన్స్పోర్టు ఏజెన్సీలపైనా కన్నేశాయి. ఎలాంటి అనుమానాస్పద పార్సిల్స్ వచ్చినా తమకు సమాచారం అందించాలని అధికారులు సదరు ట్రాన్స్పోర్టు ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు
కరీంనగర్లో నాలుగు వ్యవసాయ డివిజన్లు, 15 మండలాలు ఉండగా రెండు (స్కాడ్స్) తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి ఏడీఏ (ట్రైనింగ్)ఎన్ అంజనీ (7288894115), గంగాధర ఏడీఏ జే రామారావు (7288894088) నేతృత్వంలో పని చేస్తాయి. వీటితో పాటు ఆయా మండలాల్లో వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మండలానికో ఐదుగురి చొప్పున 12 బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టింది. సభ్యుల్లో ఏవో, ఎస్ఐ, ముగ్గురు వ్యవసాయ సిబ్బంది ఉంటారు. ఈ బృందాలను జిల్లా స్థాయిలో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఒక వ్యవసాయ శాఖ అధికారి ఏర్పాటు చేసిన బృందం పర్యవేక్షిస్తుంది. అన్ని బృందాలను జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తారు. కాగా, జిల్లాలోని అన్ని మండలాల్లో వారం రోజులుగా టాస్క్ పోర్సు బృందాలు విస్తృ తనిఖీలు చేస్తున్నాయి. ఇటీవల తనిఖీ బృందాలతో ఎస్పీ రాహుల్హెగ్డే సమావేశం నిర్వహించి నకిలీ ముఠాలపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు.
జగిత్యాల జిల్లాలో జిల్లాస్థాయిలో ఒక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా వ్యవసాయాధికారి, సీఐ, తహసీల్దార్ ఉంటారు. జిల్లాలోని 18 మండలాల్లో మండలానికో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏవో, ఎస్ఐ, తహసీల్దార్ ఉంటారు.
పెద్దపల్లిలో జిల్లాలో స్థాయిలో ఏడీఏ, ఏఎస్ఐ, విత్తన ధ్రువీకరణ అధికారితో ఒక బృందాన్ని, మండల స్థాయిలో ఏవో, ఎస్హెచ్వో పోలీస్తో 14 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఈ నెల 1 నుంచి తనిఖీలు చేస్తున్నాయి.
తనిఖీ బృందాలు ఏం చేస్తాయి?
ఇవి విత్తన దుకాణాలు, గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర అనుమతి లేని ప్రదేశాల్లో నకిలీ, లూజ్ విత్తనాలు, నిషేధిత హెచ్టీ విత్తనాలు విక్రయించినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటాయి.
లూజ్ విత్తనాలు కొనవద్దు..
రైతులు ఎట్టి పరిస్థితుల్లో లూజ్ విత్తనాలు కొనవద్దు. అవి హెచ్టీ విత్తనాలు అయి ఉంటాయి. వాటిని సాగు చేసే పర్యావరణానికి ముప్పు వాటిళ్లుతోంది. దయచేసి రైతులు అర్ధం చేసుకోవాలి. రైతులకు కావల్సిన విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాదాపు 5 లక్షల ప్యాకెట్లు తెప్పించాం. లూజ్ విత్తనాలు కొని రైతులు పర్యావరణానికి ముప్పు కలిగించ వద్దు, నేరుగా నష్టపోనూ వద్దు. బీటీ విత్తనాలపై ఈసారి గట్టి నిఘా పెట్టాం. మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సీజన్లో ఇంత వరకు ఎలాంటి లూజ్, నకిలీ విత్తనాలు జిల్లాకు రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీజన్ దగ్గర పడుతున్న కొద్ది నిఘాను తీవ్రతరం చేస్తున్నాం. పోలీసులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఏడీఏల స్థాయిలోనే కాకుండా మండల స్థాయిల్లో కూడా ఈ సారి టాస్క్ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఎటొచ్చి రైతులు సహకరిస్తేనే ఈ దందాను అరికట్టగలుగుతాం.
– వాసిరెడ్డి శ్రీధర్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి
నాలుగేళ్లుగా జోరుగా దందా
రెండేళ్ల కింద కరీంనగ్ జిల్లా హుజూరాబాద్లో 39.62 క్వింటాళ్ల లూజ్ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఈ పట్టణంలోని గాయత్రీనగర్లోని ఓ గోదాంలో పెద్ద ఎత్తున లూజ్ విత్తనాలు ప్యా కింగ్ చేస్తుండగా పోలీసులు, వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై క్రిమినల్ కేసు లు పెట్టి జైలుకు పంపించారు. అంతకు ముం దు సంవత్సరం కరీంనగర్లోని వినాయకనగర్లోనూ ఇదే పరిస్థితి. అప్పుడు కూడా పెద్ద ఎత్తున లూజ్ పత్తి విత్తనాలను టాస్క్ఫోర్స్ పో లీసులు పట్టుకున్నారు. గతేడాది తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద టాస్క్ఫోర్స్ పోలీసు లు ఇలాంటి విత్తనాలనే పట్టుకోవడంతో ఏటా ఈ దందా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లోని విద్యానగర్, చిగురుమామిడి మండలంలో ఇలాంటి అక్రమ దందాలు వెలుగుచూశాయి.