పెండింగ్ పనులు పూర్తి చేయాలి
చొప్పదండిని మరో కోనసీమగా మార్చాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష
కరీంనగర్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సిరిసిల్ల జిల్లాకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరాకూ నీరందించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసే బాధ్యతలను వినోద్కు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శశాంక, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్లు, సీఈలు, ఎస్ఈలతో చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని సాగునీటి పెండింగ్ పనులపై సమీక్షా ఆయన సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా ముందుగా ఉమ్మడి జిల్లాకు నీరందుతుందని, ప్రతి ఎకరాకూ సాగునీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజక వర్గం పరిధిలో సాగునీటి పెండింగ్ పనులు పూర్తి చేయాలని, సాగులోకి రాక మిగిలిపోయిన ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.
చొప్పదండిని కోనసీమగా మార్చాలి..
చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులను వినోద్కుమార్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ చొప్పదండి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చొప్పదండిని వాటర్ హబ్గా మార్చాలని, మరో కోనసీమగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని అధికారులకు వివరించారు. గాయత్రి పంప్హౌస్, మిడ్మానేరు జలాశయం, రాంపూర్ పంప్హౌస్ చొప్పదండి నియోజకవర్గంలోనే ఉన్నాయని, ఇవి ఉన్నా కూడా కొన్ని గ్రామాలకు సాగునీరందండం లేదనన్నారు. మోతె రిజర్వాయర్కు బదులుగా 240 కోట్లతో నాలుగు ఓటీలు మంజూరు చేశారని, దీనికి సంబంధించిన భూ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నారాయణపూర్ కుడి, ఎడమ కాలువ పూర్తిచేసి నీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులైన నారాయణపూర్, మంగపేట, చర్లపల్లి గ్రామస్తులకు నష్టపరిహారం అందించాలన్నారు. ఎడమ, కుడి కాలువ అక్కడక్కడ పూర్తి కాలేదని, పోతారం ఎడమ, కుడి కాలువలు పూర్తయితే ఆయా ప్రాంతాల రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించవచ్చన్నారు. దొంగలమర్రి వద్ద రైల్వే ట్రాక్పై బ్రిడ్జిని నిర్మించి అసంపూర్తిగా ఉన్న కాలువల నిర్మాణం పనూర్తి చేయాలని అధికారులను వినోద్కుమార్ ఆదేశించారు. చొప్పదండి నియోజకవర్గం చుట్టూ నీళ్లున్నా కొన్ని గ్రామాలకు అందకపోవడం బాధగా ఉందని, తొందరగా కాలువలు పూర్తి చేసి నీళ్లందిస్తే రైతులు హర్షిస్తారని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ ఇన్చీఫ్ వెంకటేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ శంకర్, సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు.
కొవిడ్ వ్యాక్సినేషన్పై ఆరా
విద్యానగర్, జూలై 16: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరా తీశారు. శుక్రవారం కరీంనగర్లోని తన నివాసంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జువేరియాతో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించారు. వ్యాక్సినేషన్ను నిరంతరంగా, ముమ్మరంగా నిర్వహించాలన్నారు. సమస్యలుంటే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తే పరిషరిస్తామన్నారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి వ్యాక్సినేషన్ విషయంలో కరీంనగర్ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని, తగినన్ని డోసులు పంపించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 7,93,858 మంది జనాభా ఉండగా, కొవిడ్ మొదటి డోస్ 3,24,251 మందికి, రెండో డోస్ 46,211మందికి వేసినట్లు డీఎంహెచ్వో తెలిపారు. సమీక్షలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు పాల్గొన్నారు.