పేదల మోములో చిరునవ్వే సీఎం లక్ష్యం
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
సమర్థవంతమైన నాయకుడు కేటీఆర్ : మంత్రి ప్రశాంత్రెడ్డి
రూ.కోటితో ఇండోర్ స్టేడియానికి రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ హామీ
రాజన్న సిరిసిల్ల/ కరీంనగర్, జూన్ 16(నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట: ఇరికిరుకు ఇండ్లలో ఇన్నాళ్లూ కాలం వెల్లదీసిన నిరుపేదల కోసం రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చుట్టం వస్తే ఎక్కడ ఉండాలో తెలియక అవస్థలు పడ్డ వారి ఆత్మగౌరవం నిలబెడుతున్నారని చెప్పారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం పర్యటించిన ఆయన, పలు చోట్ల ప్రసంగించారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడ్డామని, మన పిల్లల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. అందుకు అటవీశాఖ, ఎక్సైజ్ శాఖలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పేదలకు రూ.200లు ఉన్న పింఛన్ను రూ.2016లకు పెంచడమే కాకుండా, రాష్ట్రంలోని బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఒకనాటి దుర్భిక్ష ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కాళేశ్వర జలాల రాకతో కోనసీమను తలపిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా కాలువలు, చెరువులు నీటితో కళకళలాడుతుంటే అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు..
రైతులు చెప్పింది చేసేందుకు సిద్ధం
రైతులు ఏది చెప్పినా చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బోయినపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అధ్యక్షతన జరిగిన రైతువేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తమ అమ్మమ్మ గ్రామం కొదురుపాకతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు వెనుకబడిన ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూస్తే ఇది మన దేశమేనా అన్న ఫీలింగ్ కలుగుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్ధిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. శాభాష్పల్లి వంతెన నిర్మా ణం కోసం సమైక్య రాష్ట్రంలో ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని, అదే కొట్లాడి సాధించిన తెలంగాణలో అద్భుతంగా నిర్మించుకోగలిగామని చెప్పారు. ఈ వంతెన వద్ద చూస్తే మిడ్మానేరు నీళ్లు సముద్రాన్ని తలపించేలా కనిపిస్తున్నాయని తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నందున విపరీతమైన లారీలు నడిచి మామూలు రోడ్లు దెబ్బతింటున్నాయని, ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా మార్చాలని సమైక్య రాష్ట్రంలో చేసిన ప్రయత్నాలు నెరవేరలేదని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా రోడ్డును నిర్మించుకుంటున్నామన్నారు. కేసీఆర్ పాలనలో ఎన్నో ఊహించని పనులు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు సిరిసిల్ల, బోయినపల్లి, వేములవాడ, హుస్నాబాద్ ప్రాంతాలన్ని తీవ్ర కరువు ప్రాంతాలని, ఇప్పుడు ఆరు మీటర్లపైన నీళ్లు ఉన్నాయంటే గతంతో పోల్చితే 20 మీటర్లు భూగర్భ జలం పైకి వచ్చినట్లు మంత్రి వివరించారు.
ఎంత మందికైనా రైతుబంధు ఇస్తాం
రైతుల కోసం ఎన్నికోట్లు ఖర్చు చేసేందుకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎంత మందికైనా రైతుబంధు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు కేటాయించామని అన్నారు. ఈ వానకాలం కోసం రూ. 7,508 కోట్లు చెల్లిస్తామన్నారు. పది రోజుల పాటు రైతుబంధు కొనసాగుతుందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదా అన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయన్నారు.
సాహసోపేత నిర్ణయాలు : మంత్రి
పేదలకు పథకాలు అందించేందుకు సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. దేశంలోనే పేదలకు డబుల్బెడ్ రూం ఇండ్లు కట్టించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని కొనియాడారు. కాలువల్లో నీరు, వాడ వాడలా సీసీ రోడ్లు, ఇలా అన్ని రంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. అమెజాన్, మైక్రోసాప్ట్, తదితర కంపెనీలు తొలి కార్యాలయాలు అమెరికాలో ఏర్పాటు చేస్తే రెండోది మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే యువత ఉపాధి కల్పనకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ, మున్సిపల్ చైర్ పర్సన్లు న్యాలకొండ అరుణ, జిందం కళ, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, జిల్లా అధికార ప్రతినధి తోట ఆగయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ చైర్మన్ ఆకుల శంకరయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, సూపరింటెండెంట్ మురళీధర్రావు, ఆర్అండ్బీ ఈఈ కిషన్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, ఎంపీపీ పిల్ల రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు పాల్గొన్నారు.