జాతీయస్థాయి పోటీలకు సిద్ధమవుతున్న పంచాయతీలు
అమృత్ మహోత్సవ్ కోసం లఘు చిత్రాలు
తొమ్మిది అంశాలపై డాక్యుమెంటరీలు
కరీంనగర్, జూలై 15 (నమస్తే తెలంగాణ):‘స్వచ్ఛ ఫిల్మోంకి అమృత్ మహోత్సవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న లఘు చిత్రాల జాతీయస్థాయి పోటీలకు పలు గ్రామ పంచాయతీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు స్వచ్ఛతకు సంబంధించి తొమ్మిది అంశాలపై డాక్యుమెంటరీలు రూపొందించాల్సి ఉండగా, స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. కాగా, ఇప్పటికే అనేక గ్రామాలు జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కించుకని చెరగని ముద్ర వేసుకోగా, పల్లె ప్రగతి స్ఫూర్తితో ఈ పోటీల్లో భాగస్వామ్యమై మరోసారి అవార్డుల పంట పండించేందుకు సిద్ధమతున్నాయి. చెత్త నిర్వహణలో ఇప్పటికే ముందువరుసలో నిలిచిన పంచాయతీలు జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటేందుకు రెడీ అవుతున్నాయి.
స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని అనేక గ్రామాలకు జాతీయస్థాయి అవా ర్డులు వచ్చాయి. తాజాగా, ‘స్వచ్ఛ ఫిల్మోంకి అ మృత్ మహోత్సవ్’ పేరుతో లఘు చిత్రాల పోటీని జాతీయ స్థాయిలో నిర్వహిస్తుండగా, దీనికి సైతం జిల్లా నుంచి అనేక గ్రామాలు సిద్ధమవుతున్నాయి. పోటీల్లో భాగస్వామ్యం అయ్యేందుకు 9 అంశాలపై లఘుచిత్రాలు రూపొందించాల్సి ఉంటుంది.
ఎంపిక ఇలా..
లఘు చిత్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలోని స్వచ్ఛ భారత్ మిషన్ వింగ్ అధికారులను సంప్రదించి వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి. ఆగస్టు 15 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. అప్పటిలోగా అప్లోడ్ చేసిన లఘు చిత్రాలను కేంద్రంలోని స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. ఇందులో ప్రథమ బహుమతి కింద రూ.1.60 లక్షలు, ద్వితీయ బహుమతి కింద రూ.60 వేలు, తృతీయ బహుమతి కింద రూ.30 వేలు అందిస్తారు.
పల్లె ప్రగతి స్ఫూర్తిదాయకం
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఫిల్మోంకి అమృత్ మహోత్సవ్లో పోటీ పడేందుకు కరీంనగర్ జిల్లాలోని పలు పంచాయతీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్ మండ లం తాహెర్ కొండాపూర్, ఫకీర్పేట్, మందులపల్లి, శంకరపట్నం మండలం ముత్తారం, మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి, జమ్మికుంట మండలం విలాసాగర్, గన్నేరువరం మండలం ఖాసీంపేట, కొత్తపల్లి మండలం నాగులమల్యాల, సైదాపూర్ మండలం వెన్నంపల్లి, సర్వాయిపేట, హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామాలు ఈ పోటీలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయి. మరిన్ని పంచాయతీలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఎం ప్రతినిధులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతే ఇందుకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇప్పటికే నాలుగు విడుతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం కారణంగా జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడింది.
ప్రభు త్వం అన్ని గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించగా, తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువును తయారు చేసేందుకు ఈ షెడ్లు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అనేక గ్రామాల్లో పంచాయతీలు తడి, పొడి చెత్త నిర్వహణకు ఇంటింటికీ రెండు చెత్త బుట్టలను పంపిణీ చేశాయి. ఈ నేపథ్యంలో చెత్త నిర్వహణపై గ్రామీణ ప్రజల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. చెత్తను డంప్ చేసేందుకు ప్రతి గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రాక్టర్ను సమకూర్చింది. ప్రతి రోజూ గ్రామాల్లో వెలువడే చెత్తను ఈ ట్రాక్టర్ల ద్వారా సేకరించి సెగ్రిగ్రేషన్ షెడ్లకు తరలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే లఘు చిత్రాల పోటీ అంశాలన్నింటినీ జిల్లాలోని గ్రామాలు ప్రతి రోజూ పాటిస్తూనే ఉ న్నాయి. కేంద్రం నిబంధనల ప్రకారం ఈ పోటీ లో పాల్గొనేందుకు అన్ని గ్రామాలకు అర్హత ఉన్న ట్లే. ఇప్పుడిప్పుడే ఈ విషయం తెలుసుకుంటున్న గ్రామ పంచాయతీలు పోటీల్లో పాల్గొనేందుకు ఉ త్సాహం చూపిస్తున్నారు. మానకొండూర్ మండ లం గట్టుదుద్దెనపల్లిలో ఇప్పటికే ఈ లఘు చిత్రా న్ని ప్రారంభించారు. ప్రజల్లో వచ్చిన మార్పులను నేరుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.