ధర్మారం,అక్టోబర్ 14: తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన రాచూరి శ్రీధర్కు పార్టీ తగిన గుర్తింపునిచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో టీఆర్ఎస్ మండలాధ్యక్ష పదవి వరించింది. మండలంలోని నంది మేడారం గ్రామానికి చెందిన శ్రీధర్ సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల పిలుపునందుకొని ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. టీఆర్ఎస్వీ ఉమ్మడిజిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం, పల్లెబాట తదితర కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొప్పుల విజయానికి కృషి చేశారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వర్ గెలుపు కోసం ఖిలావనపర్తి నుంచి ధర్మారం దాకా శ్రీధర్ పాదయాత్ర చేశారు. అనంతరం 2019లో టీఆర్ఎస్వై మండలాధ్యక్ష పదవి చేపట్టిన శ్రీధర్ ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో, 2021లో హైదరాబాద్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి ఈశ్వర్ ఇన్చార్జిగా వ్యవహరించిన వెంకటాపురంలో కార్పొరేటర్ల విజయం కోసం శ్రీధర్ ప్రచారం చేశారు. ఈ క్రమంలో శ్రీధర్కు మంత్రి ఈశ్వర్ ఆశీస్సులతో ఈ పదవి వరించింది.