నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్ షో
విజయవంతం చేయాలని మేయర్ వై సునీల్రావు పిలుపు
కార్పొరేషన్, అక్టోబర్ 14: నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం బల్దియా ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం వలే ఈసారి కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున క్రాకర్ షో, అనంతరం రావణ దహనం కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రముఖ గాయకులు గీతామాధురి, శ్రీకాంత్తో పాటు జబర్దస్త్ కమెడియన్ టీం, కేరళ కథాకళి నృత్యం, జానపద నృత్యాలు, పాటలు, డాక్టర్ వైష్ణవి సాయినాథ్తో క్లాసికల్ నృత్యాలు ఉంటాయన్నారు. రెండు గంటల పాటు సాగనున్న ఈ ఉత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఇండోర్ స్టేడియం వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. అలాగే, మంచినీటి సదుపాయం, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణీహరిశంకర్, కార్పొరేటర్ బుచ్చిరెడ్డి, నాయకులు లెక్కల వేణు, ఉయ్యాల శ్రీనివాస్గౌడ్, వంగల పవన్ తదితరులు పాల్గొన్నారు.