తల్లి లాంటి పార్టీని మోసం చేసిన ఘనుడు ఈటల
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్న పార్టీ టీఆర్ఎస్
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్
హుజూరాబాద్ రూరల్, జూలై 14: ఈటల రాజేందర్ తన ఆస్తులను రక్షించుకోవడం కోసమే బీజేపీలోకి వెళ్లారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ధ్వజమెత్తారు. కన్నతల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీ గుర్తుతో ఆరుసార్లు గెలిచి పార్టీలోనే చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి మోసం చేసిన ఘనుడని మండిపడ్డారు. ఈ మేరకు హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద, జూపాక, బొత్తలపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
ఆస్తుల రక్షణ కోసమే ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లాడని, ఆరు సార్లు టీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచి ఆ పార్టీలోనే చిచ్చుపెట్టే కార్యక్రమం మొదలుపెట్టాడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ మండిపడ్డారు. బుధవారం హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద, జూపాక, బొత్తలపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీశ్కుమార్ మాట్లాడుతూ, సీఎం కావాలనే దుర్బుద్ధితోనే ఈటల రాజేందర్ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై విమర్శలు చేశాడని, కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసిన ఘనుడు ఆయన అని ధ్వజమెత్తారు. ఎస్సీ, బీసీల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేసి కోట్ల రూపాయలు ఆర్జించాడని ఆరోపించారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. ఆరుసార్లు గెలిపించిన ప్రజలను మోసం చేసి వెళ్లిపోయిన ఈటల రాజేందర్కు ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారన్నారు. ఏడేళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధ్ది కార్యక్రమాలు చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీయేనని చెప్పారు. రైతులకు రైతు బంధు, బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమని కొనియాడారు. వచ్చే ఉప ఎన్నికలో కేసీఆర్ ఎంపిక చేసిన అభ్యర్థికే ఓటేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు చొల్లేటి కిషన్రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఎడవెళ్లి కొండల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ కంకణాల విజయరెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలన్న, ఎంపీటీసీ వేణుగోపాల్రెడ్డి, సర్పంచులు స్వరూప, నాయకులు ఇరుమల్ల సురేందర్రెడ్డి, మొలుగూరి ప్రభాకర్, శ్యాంసుందర్రెడ్డి, తేజరెడ్డి, శ్రీనివాస్, భాస్కర్రెడ్డి, రాజిరెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.
ఆస్తులు కాపాడుకునేందుకే
ఈటల రాజేందర్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే తపన పడుతున్నాడు. తానే ప్రభుత్వ భూములను కొనుగోలు చేశానని ఒప్పుకొన్నాడు. బాధితులు ఫిర్యాదు చేస్తేనే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఏడేండ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తన ఆస్తులు పెంచుకున్నాడే తప్ప, హుజూరాబాద్కు మాత్రం ఏం పనులు చేసిన దాఖలాలు లేవు.
కుల సంఘాల పేర్లు చెప్పి సంపాదించిండు
ఈటల కుల సంఘాల పేర్లు చెప్పుకొంటూ సంపాదించుకున్నాడు తప్ప, కుల సంఘాలకు చేసింది ఏమీ లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే బీసీ నాయకుడినంటూ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మాయచేస్తడు. ఇప్పుడు కూడా అదే తీరుగా వస్తుండు. ఇక నుంచి ఈటల రాజేందర్ను నమ్మే రోజులు లేవు. ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయి.
-కానుగంటి శ్రీనివాస్, ఉప్పర కుల సంఘ నాయకుడు, కనుకులగిద్ద