ఉమ్మడి జిల్లాకు రూ.656.83 కోట్లు
రైతులకు వానకాలం సర్కారు సాయం
నేటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ l6.48 లక్షల మంది రైతులకు లబ్ధి
కరీంనగర్, జూన్ 14(నమస్తే తెలంగాణ):రైతన్నకు పెట్టుబడి వస్తోంది. కరోనా కష్ట కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తున్నది. వానకాలం రైతుబంధును మంగళవారం నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నది. ఎకరానికి రూ.5 వేల చొప్పున అందించనున్నది. వరుసగా ఏడోసారి ఇస్తుండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి 6,48,570 మందికి లబ్ధి చేకూరనున్నది. వీరికి రూ.656.83 కోట్ల సాయం అందనున్నది.
పంట పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇస్తున్న ఆర్థికసాయం బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో జమకానున్నది. వరుసగా ఇప్పటికే ఆరు సీజన్లకు అందివ్వగా, ఏడోసారి ఈ వానకాలానికి ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన భూములకు రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అదనంగా మరికొంత మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్వోఎఫ్ఆర్ భూములకు సైతం ఈ సాయం అందనున్నది. పోడు భూముల్లో ఎన్నో ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు సీఎం కేసీఆర్ ఔదార్యంతో తీసుకున్న నిర్ణయం ఎంతో ఊరట కలిగిస్తుంది. ఈ నెల 15 నుంచి 25 లోపు రైతుబంధు సాయం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎకరం భూమి ఉన్న రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ రైతుబంధు గ్రాంటును జమచేస్తున్నారు. మిగతా వాళ్లకు క్రమంగా జమ చేస్తారని అధికారులు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో ఈ సీజన్లో 1,80,8 76 మంది రైతులను అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం రూ.179 కోట్ల 51 లక్షల 71 వేల 757 పెట్టుబడి రాయితీ కింద మంజూరు చేసింది. మొత్తం రైతు ల్లో 1,65,552 మంది రైతుల వివరాలను మండ ల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వీరిలో 59,782 మంది వివరాలను ఇప్పటికే ట్రెజరీకి పంపించారు. వీరికి రూ. 16 కోట్ల 84 లక్షల 41 వేల 445 మంగళవారం నుంచి జమకానున్నాయి. రైతు బంధు పొందుతున్న వారిలో 30,837 మంది ఎస్సీ రైతులకు రూ.18కోట్ల 82లక్షల 46వేల 029, 856 మంది ఎస్టీ రైతులకు రూ. 63,11,267, 1,49, 185 మంది ఇతర రైతులకు రూ.160కోట్ల 06లక్షల 14వేల 461 చొప్పున జమ చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో 2,10,563 మంది రైతులకు రూ.210.98 కోట్లను రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో ఎకరంలోపు ఉన్న రైతులు 72 వేల మంది ఉండగా, 1-2 ఎకరాల్లోపు వారు 48 వేల మంది ఉన్నారు. మిగతా వారంతా రెండెకరాలకు పైబడి ఉన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని 1,39,554 మంది రైతులకు రూ.137.12 కోట్లను రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు 1,26,669 మంది రైతుల బ్యాంక్ వివరాలు అప్డేట్ అయ్యాయి. ఇందుకు రూ.129.77 కోట్లను రోజు వారీగా రైతుల ఖాతాలో జమకానున్నాయి. మిగిలిన వారి బ్యాంక్ ఖాతాలు అప్డేట్ కాగానే వారి ఖాతాల్లో డబ్బులు జమవుతాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1,17,577 మంది రైతులకు రూ.129.21 కోట్లు వారి ఖాతా ల్లో రైతుబంధు కింద జమకానున్నాయి. గత వానకాలంలో 1,12,784 మందికి రూ.128.06 కోట్లు చెల్లించగా, ఈ వానకాలంలో 4,793 మం ది కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందనున్నది.