ఆత్మహత్యల నివారణకు చర్యలు
5 కోట్లు మంజూరుకు సర్కారుకు ప్రతిపాదనలు
సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు నిర్ణయం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
ఎమ్మెల్యే సుంకెతో కలిసి వంతెన పరిశీలన
బోయినపల్లి, ఏప్రిల్ 14: శాభాష్పల్లి హైలెవల్ వంతెన వద్ద ఆత్మహత్యల నివారణ కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రత్యేక చొరవ చూపారు. బ్రిడ్జిపై భారీ ఫెన్సింగ్తోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 5 కోట్లు మంజూరుకోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, బుధవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి వినోద్ వంతెనను పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులు.. సమస్యలకు సూసైడ్ పరిష్కారం కాదని ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.
బోయినపల్లి మండలం శాభాష్పల్లి హైలెవల్ వంతెన వద్ద ఆత్మహత్యల నివారణ కోసం భారీ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్న కారణాలకే వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఇటీవల తరచూ దినపత్రికలు, ఎలక్ట్రానిక్ చానళ్లలో చూస్తే బాధ అనిపించిందని చెప్పారు. తనతోపాటు ఎమ్మెల్యే రవిశంకర్ సూచన మేరకు రోడ్డు భవనాల శాఖ అధికారులు అంచనాలు రూపొందించారని, 5 కోట్లు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపినట్లు వివరించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకుని జీవించాలని సూచించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ఎస్సారార్ జలాశయం వంతెనపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు, ఈఎన్సీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఫెన్సింగ్తో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. త్వరగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
మొదటి వేవ్కు.. రెండో వేవ్కు తేడా ఉంది : మంత్రి ఈటల
ఏడాదిన్నరలో నెల్లికల్ లిఫ్ట్ పూర్తి : సీఎం కేసీఆర్
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో భారీగా చేరికలు
హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు