కరీంనగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :బీజేపీ నేత ఈటల రాజేందర్కు మంత్రి హరీశ్రావు విసిరిన సవాల్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దుమారం రేపుతున్నది. గ్యాస్ సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వం 291 పన్ను వసూలు చేస్తోందని మాట్లాడుతున్న రాజేందర్.. అదే నిజమైతే రుజువు చేయాలనే డిమాండ్ వస్తున్నది. పదే పదే నొక్కిచెప్పిన ఈటల.. మంత్రి సవాల్ విసిరి 24గంటలు గడుస్తున్నా ఎందుకు స్పందించడం లేదని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నీ మాటల్లో నిజాయితీ ఉంటే చర్చకు ఎందుకు రాలేదని నిలదీస్తున్నారు. పన్నుపై నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేనా? నీదంతా తప్పుడు ప్రచారమేనా? అని మండిపడుతున్నారు. నీ స్వార్థం కోసం ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలుకుతున్నారు. ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం చేశామని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. సామాన్యులెవ్వరూ కొనుగోలు చేయలేని స్థితికి వెళ్లిపోయాయి. ఓవైపు పెట్రోలు, డీజిల్ ధరలు పైపైకి చేరుతోంటే.. మరోవైపు సిలిండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గృహిణులు కేంద్రం తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఎంగిలిపూల రోజు హుజూరాబాద్, వీణవంకలో సిలిండర్ల చుట్టూ బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఓవైపు రేట్లు పెరగడం.. మరోవైపు ఇచ్చే గ్యాస్ సబ్సిడీని భారీగా తగ్గించడం వంటి అంశాలపై బీజేపీ నాయకులను నిలదీస్తున్నారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు కూడా తమ ప్రచారంలో ప్రశ్నిస్తున్నారు. ధరలు పెంచిన బీజేపీకి ఓటువేస్తారా..?లేక సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకుంటున్న టీఆర్ఎస్కు వేస్తారా..? హుజూరాబాద్ బిడ్డలు తేల్చాలని పిలుపునిస్తున్నారు. ఇది మింగుడు పడని రాజేందర్.. ఈ అంశం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఓ కొత్త డ్రామాకు తెరతీశారు. గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే పన్ను రూపంలో వసూలు చేస్తున్నదని ప్రచారం చేస్తూ వస్తున్నారు. నోరు విప్పితే రాజేందర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని చెప్పడానికి ఇదో నిదర్శనం. ఆయన గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతనికి అన్ని విషయాలు తెలుసు. అయినా ఓట్లు దండుకోవాలన్న దురాశతో పచ్చి అబద్ధాలు చెప్పి ప్రస్తుతం టీఆర్ఎస్ చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. మంత్రి హరీశ్రావు హుజూరాబాద్ వేదికగా సవాల్ చేసి 24 గంటలు దాటినా.. రాజేందర్ వైపు నుంచి కనీస స్పందన లేదు. ఈ నేపథ్యంలో మంత్రి సవాల్పై స్పందించాలని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు పదే పదే మాట్లాడిన ఈటల ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నీ మాటల్లో నిజాయితీ ఉంటే కచ్చితంగా చర్చకు రావాలని, వచ్చి సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. లేకుంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు అన్నట్లేనా అని అడుగుతున్నారు. నీ స్వార్థం కోసం ఇలా ఏది పడితే అది మాట్లాడుడు సరికాదని హితవుపలుకుతున్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.
ఎన్ని చెప్పినా జనం నమ్మరు..
బీజేపీ నేత ఈటల రాజేందర్కు దమ్ముంటే మంత్రి హరీశ్రావు విసి రిన సవాలు తీస్కోవా లె. సిలిండర్ బుడ్డి ధరల రూ.291 పన్ను తెలంగాణ ప్రభుత్వం ఏస్తుందనడం ఆయన అవివేకం. హుజూరాబాద్ ప్రజలు ఇన్ని రోజులూ ఈటల జెప్పింది విని తలలు ఊపిన్రు. ఇప్పుడు ఆళ్లకు అన్ని అర్థమైతు న్నయ్. ఆయన మాటలు నమ్మరు. ఈటల అన్న మాటనే నిజమైతే మంత్రి ఏసిన సవాల్కు సిద్ధంగ ఉండాలె. కానీ ఇప్పటిదాక ఎలాంటి జవాబు చెప్పలేదంటేనే అర్థమైతాంది ఈటల ప్రజలను ఎంత రెచ్చగొడుతున్నడో..! తప్పుడు ప్రచారం జేసి మరోసారి ప్రజలను మోసం జేయాలని ఈటల సూస్తుండు.
నలుగుట్ల నిరూపించాలె..
గ్యాస్ సిలిండర్ ధర మీద రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధిస్తుందని మొన్న మీటింగ్లో ఈటల చెప్పిన్రు. అది నిరూపించమని, కావాలంటే నలుగురి ముందట తెల్లగోలుజేయాలని మంత్రి హరీశ్రావు సవాల్ జేసిండు. ఈటల చెప్పింది నిజమైతే అందరిముంగట నిరూపించాలె. మొన్నటిదాక టీఆర్ఎస్లో మంత్రిగ పనిజేసిన నువ్వు బీజేపీల చేరినవ్. అప్పట్ల కేంద్రపోళ్లు రేట్లు వెంచిండ్రని చెప్పినవ్.. ఇప్పుడేమో రాష్ట్రపోళ్లు పెంచుతుండ్రని చెబుతున్నవ్ నీ మాటలు ఎట్ల నమ్మాలి ఈటల. నువ్వు చెప్పేది నిజమైతే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను బీజేపోళ్లు తగ్గించేటట్లు చెయ్యి. అప్పుడు అడుగు మా ఓట్లు.
గిట్ల జెప్పుడు ఆయనకు అలవాటె..
తప్పుడు ప్రచారం జేసుడు రాజేందర్కు అలవాటె. ఆయిన ఇప్పుడైనా మాటమీద ఉంటా అని నిరూపించుకోవాలె. సిలిండర్ ధరలో రాష్ట్ర ప్రభుత్వం రూ.291 పన్ను ఏస్తుందని ఈటల అంటున్నడు. మంత్రి హరీశ్రావు ఏమో ట్యాక్స్ తీసుకుంటలేమని, 5శాతం జీఎస్టీ మాత్రమే తీసుకుంటున్నమంటుండు. దీని మీద చర్చకు కూడా సిద్ధమన్నడు. తన మాటల్ల నిజం లేకపోతే.. మంత్రి పదవికి రాజీనామా సుత జేస్తనన్నడు. లేకుంటే ఈటలను పోటీ నుంచి తప్పుకోవాలన్నడు. మరి నిజమైతే ఈటల చర్చకు రావాలె. లేదంటే ఎన్నికల్ల పోటీ నుంచి తప్పుకోవాలె. అందుకే బీజేపీని ‘బహుత్ ఝాటా పార్టీ’ అంటుండ్రు.
గీ ఝాటా మాటలెందుకు?
ఈటల రాజేందర్ మాటలన్నీ ఝాటానే. బీజేపీ సర్కారు అధికారంలోకి అచ్చినప్పటి సంది పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలను పెంచుతాంది. బీజేపోళ్లు ధర పెంచితే టీఆర్ఎస్ సర్కారు ట్యాక్స్ ఏస్తుందని రాజేందర్ అంటాండు. ఈటల చెప్పేది నిజమైతే చర్చకు రావాలె. తెలంగాణ ప్రభుత్వం విధిస్తుందన్న రూ.291 సంగతి తేల్చాలె. ఈటల మాటలను ప్రజలు నమ్ముతలేరు. ఇకనైనా ఆయన దొంగ మాటలు బంద్ జేయాలె.
మీ బీజేపోళ్లకు చెప్పి ధర తగ్గిస్తవా?
బీజేపోళ్ల పాలనల గ్యాస్ బుడ్డి, నూనెల రేట్లు పెరిగినయ్. వంటజే సుకొని తినడం ఇబ్బందైతాంది. ఈటల సారు మీ బీజేపోళ్లకు చెప్పి వాటి ధరలు తగ్గిస్తవా? సిలిండర్ ధర 500 తగ్గించమని చెప్పు. ఎన్నికల మీటింగ్ల గ్యాస్ సిలిండర్ మీద రాష్ట్రం రూ.291 పన్ను వేస్తుందని అన్నవ్. మరి మంత్రి హరీశ్రావు నిరూపించమని నీకు సవాల్ జేస్తే ఎందుకు మాట్లాడ్తలేవు. మాటలు చెప్పుడు కాదు, చెప్పింది నిజమని ప్రజల ముందట నిరూపించాలె. మహిళల పక్షాన అడుగుతున్నా నువ్వు జేరిన బీజేపోళ్లు సెంట్రల్ల ఉన్నరు కదా. వాళ్లతోటి చెప్పి గ్యాస్ సిలిండర్ రేట్లు తక్కువజేపియ్యి.