జమ్మికుంట రూరల్, అక్టోబర్ 13: నల్ల చట్టాలను తెచ్చి రైతులను చంపుతున్న బీజేపీకి ఓటేస్తే.. బాయి మోటర్ల కాడ మీటర్లు వస్తయని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్లి గ్రామంలో బుధవారం వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ, రైతులను గోస పెడుతున్న బీజేపీకి మన ప్రాంతంలో స్థానం లేదని మండిపడ్డారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ రైతుబంధు, 24 గంటల కరంట్, ఎరువులు, విత్తనాలు, రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. మిషన్ కాకతీయతో చెరువులు మరమ్మతు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పచ్చని తెలంగాణ సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పేదింటి బిడ్డ గెల్లు సీనును ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గిరవేణ రమ-రాజయ్య, ఎంసీటీసీల ఫోరం అధ్యక్షురాలు కడవేర్గు మమత, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేశ్, నాయకులు మనోహర్రావు, సత్యనారయణ, రమేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.