అసత్య ప్రచారానికి కేరాఫ్ కమలం నేతలు
నియోజకవర్గానికి ఈటల చేసిందేమీ లేదు
ఇరవై ఏండ్ల నియంత పాలనకు స్వస్తి చెప్పాలె
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పలు గ్రామాల కులస్తులతో సమావేశం
టీఆర్ఎస్కు మద్దతు తెలిపిన సంఘాలు
కమలాపూర్/కమలాపూర్ రూరల్, అక్టోబర్ 13: ప్రజావ్యతిరేక విధానాలు పాటిస్తూ.. అబద్ధాలకు, అసత్య ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్లా నిలుస్తున్న కేంద్రంలోని బీజేపీని ఉప ఎన్నికలో బొంద పెట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ నాయకులు సంయమనంతో ఉండాలని సూచించారు. బుధవారం కమలాపూర్ మండలంలోని నేరెళ్ల, గూడూరు గ్రామాల్లో యాదవ కులస్తులతో, వంగపల్లి గ్రామంలో గౌడ కులస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. స్వరాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. బీజేపీ నాయకులు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉండి ఈటల చేసిందేమీ లేదని, ఆయన 20 ఏండ్ల పాలనకు స్వస్తి పలుకాలన్నారు. ఈటలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఏం చేస్తావో చెప్పి ఓట్లు అడుగాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించి బీజేపీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు
టీఆర్ఎస్కు మద్దతు పెరుగుతున్నది. నేరెళ్ల, గూడూరు, వంగపల్లి గ్రామాల ప్రజలు అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు తెలిపారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఉద్యమ బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ముక్తకంఠంతో చెప్పారు. ఇక్కడ మండల ఇన్చార్జి పేరియాల రవీందర్ రావు, మండల యాదవ సంఘం ఇన్చార్జి సుందర్ రాజ్, సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు, వైస్ చైర్మన్ ఇంద్ర సేనారెడ్డి, డైరెక్టర్ తక్కళపల్లి సత్యనారాయణ రావు, సర్పంచ్ అంకటి సాంబయ్య, అఖిల భారత యాదవ సంఘం నాయకుడు పోతనబోయిన రాజయ్య, నాయకులు శ్రీనివాస్, రమేశ్రెడ్డి, శ్రీకాంత్ ఉన్నారు.