గోదావరిఖని, సెప్టెంబర్ 13: సింగరేణి ఆర్జీ-1 ఏరియా అధికారుల సంఘం ప్రతినిధులు సోమవారం జీఎం నారాయణతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై చర్చించారు. అధికారుల సంఘం అధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఫిల్టర్ బెడ్కు మరమ్మతు చేయడం, మిషన్ భగీరథ నీటిని కాలనీలకు సరఫరా నిర్ణయం తీసుకొని అమలు చేసినందుకు, ఇందుకు సహకరించిన సింగరేణి యాజమాన్యం డైరెక్టర్ చంద్రశేఖర్, జీఎంకు స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాత బడిన క్వార్టర్ల స్థానాల్లో కొత్తవి దశలవారీగా నిర్మించాలని, అన్ని కాలనీల్లో క్వార్టర్లకు రెండో బాత్ రూం సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించారు. ఆర్సీవోఏ క్లబ్ను పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఏసీ సౌకర్యం కల్పించి జిమ్ రూము ఏర్పాటు చేయాలని, ఎంట్రెన్స్లో డివైడర్ను కలిగిన రహదారిని నిర్మించాలని కోరారు. పవర్హౌస్ కాలనీలో శాశ్వత డ్రైనేజీలు, ఇంటర్నల్ తారు రోడ్లు కొత్తవి నిర్మించాలన్నారు. శారదా నగర్ కాలనీలో తాగునీటి సరఫరా పీవీసీ పైపులైన్ పాడై తరచూ ఇబ్బందులు వస్తున్నందున కొత్త పైపులైన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్సీ క్వార్టర్లను ఆనుకొని ఉన్న పార్కులో పాములు బెడద నివారించాలని కోరారు. క్వార్టర్ల కౌన్సెలింగ్ నెలవారీగా నిర్వహిస్తూ బెటర్మెంట్లో ఒక కాలనీ నుంచి ఇంకొక కాలనీకి అదే టైపు క్వార్టర్లు కూడా అనుమతించాలని, అన్ని కాలనీల్లో తారు, సిమెంట్ రోడ్లు వేయాలని విన్నవించారు. ఇల్లందు ఏరియాలో గని మేనేజర్పై జరిగిన దాడిని ఖండించి ఇలాంటి చర్యలు జరగకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు తిరుపతి రెడ్డి, మదన్ మోహన్, కిరణ్ రాజ్కుమార్, సలీం ఉన్నారు.