టీఆర్ఎస్ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్.. యువతకు దిశానిర్దేశం
జమ్మికుంట, సెప్టెంబర్ 13: బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నదని, కేంద్రం కుట్రలను భగ్నం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ యువతకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని రిజర్వేషన్లను రద్దు చేసేందుకు పావులు కదుపుతున్నదని, దీని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక యువత రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని వినాయక గార్డెన్స్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రావుల శ్రీధర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన యువ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యువతకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టారని, మరో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో రానున్నదని తెలిపారు. బీజేపీ మోసాలను ఎండగడుతూనే, టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సర్కారు అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని, పథకాలను ప్రచారం చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్య కలిగించాలని కోరారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. బీజేపీలో ఈటల ఎందుకు చేరాడు.. కన్నతల్లిలాంటి పార్టీని వీడిన వైనాన్ని తెలియజెప్పాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో యువత సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమకారుడు, యువకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నాడని, సీఎం ఆశీర్వదించిన సీనును గెలిపించుకోవడం మన బాధ్యతన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోటని, గెల్లును గెలిపించుకుని సీఎంకు కానుకగా అందిద్దామన్నారు. సీను గెలుపు కోసం ప్రతి యువకుడు ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, నాయకులు లింగారావు, సమ్మిరెడ్డి, పలు గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.