హుజూరాబాద్ను అగ్రభాగాన నిలుపుతాం lజమ్మికుంట మండల అభివృద్ధికి పెద్దపీట lపెండింగ్ పనులన్నీ త్వరలో పూర్తి
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
జమ్మికుంట మండలంలో సమావేశాలు
జమ్మికుంట, జూన్ 13: రాష్ర్టాన్ని అభివృద్ధి చేసింది, చేసేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శాయంపేట, నాగంపేట, బిజిగిరిషరీఫ్ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలంతా చైతన్యానికి మారుపేరని, ఉద్యమ స్ఫూర్తిని చాటుతారని పేర్కొన్నారు. నియోజకర్గంలో అభివృద్ధి అనేది ప్రజల కండ్ల ముందు ఉందన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆగ్రభాగాన నిలుపుతామని హామీ ఇచ్చారు.
ఇక అందులో జమ్మికుంట మండలానికి పెద్దపీట వేస్తామని ప్రకటించారు. పెండింగ్ ఉన్న పనులన్నీ త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల ఆలోచనా విధానాల ప్రకారం సీఎం కేసీఆర్ అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తారని చెప్పారు. పార్టీలో వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ, తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఏం చేయలేరని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో అన్ని వర్గాల నాయకులు కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి పనిచేశారని, పార్టీని బద్నాం చేసిన ‘ఈటల’ వ్యక్తిత్వం ఏంటో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని, ప్రత్యర్థులకు దిమ్మదిరిగే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. తర్వాత ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పెండింగ్లో పనులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, నాయకులు కృష్ణారెడ్డి, లింగారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.