ఈటల ఏకంగా సీఎం సీటు కోసమే పన్నాగాలు పన్నిండు
అభివృద్ధిని పక్కకు పెట్టి ఆస్తులు కూడబెట్టుకున్నడు
సింగాపూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
దిశానిర్దేశకుడు : కెప్టెన్ లక్ష్మీకాంతారావు
కలిసికట్టుగా పాటుపడాలి: బస్వరాజు సారయ్య
హుజూరాబాద్ టౌన్/రూరల్, జూన్13 : ఈటల కుట్రదారు అని, మంత్రి పదవి ఇస్తే నియోజవర్గ అభివృద్ధిని పక్కకు పెట్టి వ్యక్తిగత పనులకు, ఆస్తులు కూడగట్టు కునేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆయన సీట్లో కూర్చోవాలని కుట్రలు పన్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని కిట్స్ ఆడిటోరియంలో హుజూరాబాద్ మండల, మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాగైతే తన సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యా డో.. అదే ఫార్ములాను అమలు చేయాలని మాజీ మంత్రి ఈటల చూశారని, కేసీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చోవాలని కుట్రలు పన్నాడని మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డా రు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మం డలం సింగాపూర్లోని కిట్స్ ఆడిటోరియంలో, హుజూరాబాద్ మండల, మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, బీస్సీల వద్ద తీసుకున్న భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఎర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. బిడ్డల బంగారు భవిష్యత్ కోసం, పాడిపంటల సిరుల కోసం టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి అవకాశం కల్పించాలని కోరారు. సమైక్యాంధ్రలో అవకాశం వచ్చినా పోలేదని ఈటల చెబుతున్నారని, అంటే ఆనాటి నుంచే ఆంధ్రా నాయకులకు సద్దు లు మోసినట్లుగా తెలుస్తుందని దుయ్యబట్టారు.
ఆయ న్ను ఓడించేందుకు డబ్బులు వెదజల్లుతున్నామని, కుట్రలు పన్నుతున్నామని ఆరోపణలను గుడి ముందు ప్రమాణం చేసి నిరూపిస్తావా? అని డిమాండ్ చేశారు. ఐదేండ్ల క్రితమే కేసీఆర్ను విభేదించానని చెప్పిన ఈటలను ఐదు సంవత్సరాల కోసం ఎమ్మెల్యేగా గెలిపిస్తే పోరాటం చేయకుండా వెనుదిరిగిన సైనుకుడిగా మిగిలారని ఎద్దేవా చేశారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు పార్టీ, ఎమ్మెల్యే పదవి నుంచి వైదొలిగి బలవంతంగా నియోజకవర్గ ప్రజలపై ఎన్నికలు రుద్దాడని దుయ్యబట్టారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి మారుతరుకానీ, గెలుపు మాత్రం మారదని, నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ గులాబీ జెం డాకు కంచుకోటని స్పష్టం చేశారు. హుజూరాబాద్ అభివృద్ధి ఎక్కడా ఆగదని సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో గతంలో కన్నా శరవేగంగా ప్రగతిని పరుగెత్తిస్తారని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక రైతు బంధును సీఎం కేసీఆర్ తన సొంత సోదరుడిగా భావించి ఈటల నియోజకవర్గంలోనే ప్రారంభిస్తే.. ఈ పథకాన్ని అవహేళన చేయడం ఈటల కుటిలబుద్ధికి నిదర్శనమన్నారు. సమైక్యాంధ్రలో నీరు, విద్యుత్, గిట్టు బాటు ధరలు లేక అరకొర పంటలతో చేసిన అప్పులు తీర్చలేక రైతులు అరిగోస పడ్డారని, కానీ రాష్ట్ర సాధన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల సాదక బాధకాలను అర్ధం చేసుకొని అనేక పథకాలు, ప్రాజెక్టులతో అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టు బాటు ధర కల్పించి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.
దిశా నిర్దేశకుడు కేసీఆర్: కెప్టెన్
తెలంగాణపై సమగ్ర అవగాహన కలిగి ఉండడంతోపాటు అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే దిశా నిర్దేశకుడు ఒక్క సీఎం కేసీఆర్ వల్లే అవుతుందని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలోనే ఆడబిడ్డల కన్నీళ్లను స్వయంగా గుర్తించి వారిని అదుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ను రూపొందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతుల సంక్షేమ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అనేక పథకాల అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందని చెప్పారు.
పార్టీ అభివృద్ధికి పాటుపడాలి: సారయ్య
కలిసికుట్టుగా ఉండి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పిలుపునిచ్చారు. ధైర్యంగా ఉండండి హుజూరాబాద్ నియోజవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు సీఎం కేసీఅర్ అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు. ఇక నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం మీద మంత్రులు ప్రత్యేక దృష్టిసారిస్తారని తెలిపారు. బడుగు బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నదని ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ అందజేస్తూ రూ.400 కోట్ల భారం ప్రభుత్వమే మోస్తున్నదని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ గెలిసిందని, రాబోయే ఎన్నికల్లో ఏ అభ్యర్థిని పెట్టినా గెలిపించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్రెడ్డి, కరీంనగర్ మేయర్ సునీల్రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్లు తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, గందె రాధిక, ఎంపీపీ ఇరుమల్ల రాణీ, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మార్కెట్ చైర్మన్ రమ, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, సింగిల్ విండో అధ్యక్షులు కొండాల్రెడ్డి, సుగుణాకర్రెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఐలయ్య, నాయకులు వొడితల ప్రణబ్బాబు, బండ శ్రీనివాస్, దాసరి రమణారెడ్డి ఉన్నారు.