సిరిసిల్లలో మోడ్రన్ శీతల గిడ్డంగి
మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లెల్ల శివారులో ఏర్పాటు
6.50 కోట్లతో సకల వసతులతో నిర్మాణం
పూర్తికావచ్చిన గోదాం.. త్వరలోనే ప్రారంభం
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 13: ఐదెకరాల విశాలమైన స్థలం.. అద్దాల్లాంటి రోడ్లు.. ఆధునిక వసతులతో సిరిసిల్లలో కోల్డ్స్టోరేజ్ నిర్మాణం పూర్తయింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లెల్ల శివారులో 6.50 కోట్ల వ్యయంతో 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న శీతల గిడ్డంగి రూపుదిద్దుకున్నది. ఏడాదిన్నరలోనే ప్రధాన పనులన్నీ పూర్తిచేసుకొని, తుదిమెరుగులు అద్దుకుంటున్నది. త్వరలోనే అందుబాటులోకి రాబోతుండగా, ఇక రైతుల పంట ఉత్పత్తుల నిల్వ బాధ దూరం కానున్నది.
కాళేశ్వర జల విప్లవంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. మద్దతు ధర ఉన్నప్పుడు లాభం భారీగానే వస్తుంది. అయితే, ధర లేని సమయాల్లోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. అదే కోల్డ్ స్టోరేజ్లు ఉంటే ఆ బాధ ఉండదు. ధర ఉన్నపుడు అమ్ముకోవడం, లేని సమయాల్లో ఇక్కడ నిల్వ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కోల్డ్స్టోరేజీలను నిర్మిస్తున్నది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మించిన శీతల గిడ్డంగి నిర్మాణం పూర్తి చేసుకొని, తుది మెరుగులు అద్దుకుంటున్నది. గోదాంతో రైతులకు మేలు జరుగడమే కాదు, స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
మంత్రి కేటీఆర్ చొరవ..
రైతుల పంట ఉత్పత్తుల నిల్వ బాధ దూరం చేసేందుకు ఇప్పటికే మండలానికి ఒక 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గోదాం నిర్మించినప్పటికీ తొలిసారిగా జిల్లెల్ల శివారులో శీతల గిడ్డంగిని నిర్మించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఈ కోల్ట్ స్టోరేజ్ నిర్మాణానికి ముందడుగు వేయగా, అప్పటి కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లుతో కలిసి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 6.50 కోట్లతో పనులు చేపట్టారు. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం శీతల గిడ్డంగి, 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మరో పొడి గిడ్డంగి పనులు పూర్తయ్యాయి. ఇంకా మైనర్ పనులు అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, క్యాంటీన్ నిర్మాణం పనులు నడుస్తున్నాయి. త్వరలోనే అన్నీ పూర్తయి అందుబాటులోకి రాబోతున్నది.
త్వరలోనే ప్రారంభిస్తాం..
జిల్లెల్ల శివారులో ఐదెకరాల్లో శీతల గిడ్డంగిని 6.50కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాం. మరో 20 రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. పంటలు, కూరగాయలు, మిర్చి, మామిడితోపాటు ఇతర పండ్లను నిల్వ ఉంచుకోవచ్చు. త్వరలోనే శీతల గిడ్డంగిని ప్రారంభిస్తాం. ఈ గోదాంతో స్థానికులకు ఉపాధి దొరుకుతుంది.
సంతోషంగా ఉంది
కోల్డ్ స్టోరేజీని మా గ్రామంలోనే నిర్మించారు. ఇప్పటికే ఇక్కడ 5 వేల మెట్రిక్ టన్నుల గోదాంలు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే ఇప్పుడు కోల్డ్ స్టోరేజీ కూడా రావడం సంతోషంగా ఉంది. రైతులకు మరింత మేలు జరుగుతుంది.
– మాట్ల మధు, సర్పంచ్, జిల్లెల్ల
ఇవి కూడా చదవండి
వరంగల్ సమగ్రాభివృద్ధికి పాటుపడుతాం : మంత్రి ఎర్రబెల్లి
కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేత
రేపు ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు