కష్టకాలంలోనూ రైతులకు మేలైన సేవలు
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మంథని టౌన్/మంథని రూరల్, ఏప్రిల్ 13: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం రైతులకు మేలైన సేవలు అందిస్తున్నదని చెప్పారు. మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి, మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం జడ్పీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్లవనామ సంవత్సరంలో రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రైతులకు గన్నీ సంచుల ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు అందుబాటులో ఉంచారన్నారు. కాగా లక్కెపూర్, ఖానాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శంకర్లాల్, తదితరులు పాల్గొన్నారు.