రైతుకు అదనపు ఆదాయం
నేల సారవంతం
మూడో పంటగా సాగు చేస్తున్న రైతులు
హుజూరాబాద్, ఏప్రిల్ 13:యాసంగిలో వేసిన వరి చేతికందడం.. నీళ్లు పుష్కలంగా ఉండడంతో అన్నదాతలు మూడో పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. బహుళ ప్రయోజనాల పెసరను ఎంచుకొని ప్రస్తుతం వరి మాగాణుల్లో విత్తనాలు అలికే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో స్వల్ప కాలంలోనే అదనపు ఆదాయం చేతికందడంతో పాటు భూ సారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
పెసర పంట దండిగా పండితే ఎకరానికి దాదాపు రూ. 20వేల పైనే రాబడి ఉంటుంది. ఎకరానికి రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో పెసళ్లకు రూ.100 నుంచి రూ.110 ధర పలుకుతున్నది. వరి కోసిన వెంటనే అనగా మార్చి చివరి వారం నుంచి మే మొదటి వారం వరకు పెసర విత్తవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత కూడా సాగు చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. అయితే 65 నుంచి 70రోజుల్లో పంట చేతికి వస్తుండడంతో వరి సాగుకు సమయం అప్పటికే మించిపోతుంది. కనుక పెసర సాగు చేయాలనుకునే రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు వేసుకోవాలి.
అదనపు లాభాలివి..
పెసర సాగుతో రైతుకు అదనపు ఆదాయం రావడంతో పాటు భూసారం పుష్కలంగా పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం చేరుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. భూమిలో నీటిని, పోషకాలను నిల్వ చేసే గుణం పెంచుతుంది. నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు సూక్ష్మ పోషకాలు భూమిలో నాలుగు శాతం వృద్ధి చెందుతాయి. నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. పంట దిగుబడి 10శాతం పెరుగుతుంది. ఎకరం పెసర సాగుతో దాదాపుగా రెండు నుంచి మూడు టన్నుల ఎరువు తయారవుతుంది. రెండు పసళ్ల పంటలకు బలాన్నిస్తుంది.
పెంట అవసరం లేదు
ఈ యేడు నీళ్లు మస్తుగా ఉండడంతో ఎకరంలో మూడో పంటగా పెసరు వేసిన. ఇక పొలంలో దో పసళ్లకు పెంట తోలనవసరం లేదు. జూన్ ఆఖరిలో ఏరడానికి వస్తుంది. భూమిలో కలియ దున్ని వరి నాటు వేస్తా. మంచిగా పండితే రూ.20వేలకు పైగానే వస్తాయి.