రంగంలోకి 2279 బృందాలు
ఇల్లిల్లూ తిరుగుతూ పరీక్షలు
జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో సర్వే పూర్తి
కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వేగవంతం
లక్షణాలు గుర్తించి సలహాలు, సూచనలు
అవసరమైన వారికి ఉచితంగా మందుల కిట్లు
హోం ఐసొలోషన్లో ఉంచి పర్యవేక్షణ
తీవ్రత ఎక్కువుంటే దవాఖానలకు తరలింపు
ఫలితమిస్తున్న సర్కారు ముందుచూపు
కరీంనగర్, మే 11 (నమస్తే తెలంగాణ) : కరోనాను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే వైరస్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. కానీ, ప్రజలను భయమే ఎక్కువగా వెంటాడుతున్నది. వైరస్ బారిన పడిన వారు బయటికి చెప్పుకోలేక పోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇంటిల్లిపాదికి ముప్పుతెస్తున్నది. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర సర్కారు కరోనా కట్టడికి మహాయుద్ధం మొదలు పెట్టింది. ఈ నెల 6వ తేదీ నుంచే ఇంటింటా సర్వేకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో రంగంలోకి దిగిన బృందాలు, ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాయి. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, ఉచితంగా మెడిసిన్ కిట్లు అందజేస్తున్నాయి. తీవ్రత ఎక్కువ ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం దవాఖానలకు తరలిస్తున్నాయి. ఇప్పటికే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వే పూర్తి కాగా, మిగతా జిల్లాల్లో మరింత వేగం పెంచాయి.
కరో నా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ముందస్తు యుద్ధం చేస్తున్నది. అందులో భాగంగానే ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటింటా జ్వర సర్వేకు శ్రీకారం చుట్టింది. ఆ మేరకు ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 2279 ప్రత్యేక సర్వే బృందా లు రంగంలోకి దిగాయి. ప్రతి వెయ్యి జనాభాకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయగా, ఒక్కో బృందం లో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, మున్సిపల్, పంచాయతీ వర్కర్లు ఉన్నారు. వీరంతా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వారికి మెడికల్ కిట్లు అందించి, హోం ఐసొలేషన్ చేస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే వారిని పరీక్షలకు పంపిస్తున్నారు. వారికి పాజిటివ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. సీరియస్గా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం దవాఖానలకు తరలిస్తున్నారు. ఈ సర్వే కారణంగా అధికారులు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. ఎక్కడెక్కడ వైరస్ తీవ్రత ఉందో తెలుసుకొని, ఆయా ప్రాంతాల్లో కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పీడితులకు భరోసా..
కరోనా లక్షణాలున్నా చాలా మంది ఇంటికే పరిమితమవుతున్నారు. బయటికి వచ్చి పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వస్తుందేమో.. లేదా తమ కుటుంబాన్ని సామాజికంగా వెలి వేస్తారేమోనని భయపడుతున్నారు. తమకు తెలిసిన మాత్రలేవో వాడుతున్నారు. కానీ, పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే వైరస్ కుటుంబసభ్యులను చుట్టుముడుతున్నది. ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇటువంటి వారికి స ర్వే సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. జ్వరం వచ్చిన వెంటనే భయపడాల్సిన పని లేదని, సరైన చికిత్స తీసుకుంటే నాలుగైదు రోజుల్లో వైరస్ను నివారించవచ్చని ధైర్యం చెబుతున్నారు. 450 విలువైన మందు కిట్ను బాధితులకు ఉచితంగా ఇస్తూ భరోసా నింపుతున్నారు.
ఏడు రకాల మందులు
వైద్య సిబ్బంది అందజేస్తున్న కిట్లో ఏడు రకాల మందులు 10 రోజులకు సరిపడే విధంగా ఉంటున్నాయి. ఇందులో ఐదు మాస్కులు, 250 ఎంఎల్ శానిటైజర్, ఒక సబ్బు, రెండు జతల గ్లౌజ్లతోపాటు అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు, విటమిన్ -సీ, జింకోవిట్, డోలో-650, సిట్రజిన్ హెచ్సీ క్యూ 200 ఎంజీ ట్యాబ్లెట్లు ఉంటాయి. ఆక్సిమీటర్ ద్వారా కూడా పరీక్షిస్తున్నారు. తగ్గకుంటే వారిని సమీపంలోని కొవిడ్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐసొలేషన్లో ఉన్నవారిని సదరు బృందం సభ్యులు రోజూ మానిటరింగ్ చేస్తున్నారు. మందులు ఎలా వాడాలో ఒక కరపత్రాన్ని ముద్రించి అందిస్తున్నారు. బయటికి వెళ్లి మందులు తెచ్చుకోలేని వారికి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత మందులతో ఎం తో మంది ఊరట పొందుతున్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకొని, కరోనాను జయిస్తున్నారు.
బాధితులకు సూచనలు..
కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించిన వాళ్లు ప్రత్యేక గదిలో ఉండాలి. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, తన పనులు తానే చేసుకోవా లి. తన వస్తువులు ఎవరూ తాకకుండా జాగ్రత్త పడాలి. రోగి భోజనం చేసిన ప్లేట్లను తనే కడు క్కోవాలి. సపరేట్ బాత్రూంను ఉపయోగించాలి. ఇంట్లో అందరూ మాస్కులు ధరించాలని సిబ్బం ది సూచిస్తున్నారు. థర్మామీటర్ ద్వారా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు సార్లు జ్వరం పరీక్షించుకోవాలని, ఊపిరి బిగబట్టే సమయం 20 సెకన్ల కన్నా ఎక్కువ ఉండాలని చెబుతున్నారు. 6 నిమిషాలు నడిచిన తర్వాత ఆయాసం రాకూడదని, పల్స్ రేట్ 100 కన్నా మించ కూడదని, ఆక్సిజన్ శాతం 94 కన్నా తగ్గ కూడదని వైరస్ బాధితులకు వివరిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో వేగంగా సర్వే..
జిల్లాలో సర్వే వేగంగా సాగుతున్నది. 684 సర్వే బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 2.60 లక్షల నివాస గృహాలుండగా, ఇప్పటికే 1,83,814 ఇండ్లలో ఉన్న 7,35, 256 మందిని పరీక్షించారు. అందులో 6,048 మందికి జ్వరాలు, కరోనా లక్షణా లు ఉన్నవారిని గుర్తించి వారికి మెడికల్ కిట్స్ అందించారు. జ్వర లక్షణాలు ఉన్నవారిని వైద్య సిబ్బంది ప్రతి రోజు గమనిస్తున్నా రు. రోజుకు ఒక సారి కౌన్సెలింగ్ చేస్తున్నా రు. లక్షణాలు తీవ్రమైతే వెంటనే ప్రభుత్వ దవాఖానాలకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ విధంగా సర్వే చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.