ఆ మేరకు పనులు చేస్తున్నాం
వ్యవసాయానికి ప్రత్యామ్నాయం పాడి పరిశ్రమే
ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రణాళిక
ఇదే లక్ష్యంతో మా డెయిరీ ముందుకెళ్తున్నది
63 కోట్లతో 3 లక్షల లీటర్ల సామర్థ్యమున్న కొత్త డెయిరీని త్వరలో ప్రారంభిస్తాం
మార్కెట్ను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం
కరోనా సమయంలో రోజుకు 10వేల లీటర్ల పాలు అదనంగా విక్రయిస్తున్నాం
‘నమస్తే’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు
కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజుకు 5 లక్షల లీటర్ల వరకు పాల డిమాండ్ ఉన్నదని, ఆ మేరకు పాలు సేకరించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు స్పష్టం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో రైతును పాడి పరిశ్రమనే ఆదుకుంటుందని, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పాడి ఉత్పత్తిని పెంచేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్కెట్ను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, 63 కోట్లతో 3 లక్షల లీటర్ల సామర్థ్యమున్న కొత్త డెయిరీని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇంకా డెయిరీ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.
‘నమస్తే’: వ్యవసాయరంగానికి ప్రత్యామ్నాయం పాడి పరిశ్రమే అంటున్నారు కదా..? మీ డెయిరీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
చైర్మన్ : ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయరంగానికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమ తప్ప మరోటి లేదు. వచ్చే ప్రసక్తే లేదు. పాడి ఉన్న చోటే పంట ఉంటుందన్న సామెత తెలిసిందే. ఈ రెండూ రైతులకు అనుసంధానమై ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయరంగం అప్పుడప్పుడు దెబ్బతింటుంది. పాడి పరిశ్రమకు ఆ అవకాశం లేదు. అందుకే వ్యవసాయం దెబ్బతిన్న సమయంలో సదరు రైతు కుటుంబాన్ని పాడి ఆదుకుంటుంది. అందుకే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఇంటికి పాడి పశువు అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం డెయిరీ పరిధిలో 70వేలకుపైగా పాడి రైతులున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను లక్షకు పెంచుతాం.
‘నమస్తే’: రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణకు సంబంధించిన పనులు ఎలా సాగుతున్నాయి?
చైర్మన్: ప్రస్తుతం డెయిరీ రెండు లక్షల లీటర్ల సామర్థ్యంతో ఉన్నది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద 63 కోట్లతో 3 లక్షల లీటర్ల సామర్థ్యమున్న డెయిరీ నిర్మాణంలో ఉన్నది. సాధ్యమైనంత తొందరగా దీనిని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 28 బల్క్కూలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. మరో నాలుగు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంతేకాదు పాడి రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఆటో మిషన్ ఫుడ్ మిక్సింగ్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి తొమ్మిదెకరాల స్థలం తీసుకున్నాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
‘నమస్తే’: సేకరణకు అనుగుణంగా మార్కెట్లో సేల్స్ ఉన్నాయా..? ఆ మేరకు మార్కెట్లో డిమాండ్ ఉందా..?
చైర్మన్: ఉమ్మడి జిల్లాలో రోజుకు 5 లక్షల లీటర్ల వరకు పాల డిమాండ్ ఉన్నది. మాతోపాటు అన్ని డెయిరీలు కలిపి చూస్తే.. ప్రస్తుతం 3 లక్షల లీటర్ల వరకు మాత్రమే పాల సేకరణ జరుగుతున్నది. అంటే డిమాండ్కు సరిపడా సరఫరా చేయలేకపోతున్నాం. దీనిని తట్టుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పాలు సేకరించి పంపిణీ చేయాల్సి వస్తున్నది. కరీంనగర్ డెయిరీ విషయానికి వస్తే ప్రస్తుతం రోజుకు 1.25 లక్షల లీటర్ల సేకరణ జరుగుతున్నది. డిమాండ్ మాత్రం రెండు లక్షల లీటర్లు ఉన్నది. ఈ సారి పెళ్లిళ్లు, శుభకార్యాలు లేకపోయినా రోజుకు 10వేల లీటర్లను అదనంగా విక్రయిస్తున్నాం. రోజుకు 50వేల లీటర్ల పెరుగును అమ్ముతున్నాం. అంటే పాలతోనే రోగ నిరోధకశక్తి పెంచుకుంటున్నట్లు తెలుస్తున్నది. భవిష్యత్లో పాల వినియోగం చాలా పెరుగుతుంది. ఒక్క ఉమ్మడి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ డిమాండ్కు సరిపడే విధంగా పాడి ఉత్పత్తి లేదు. కాబట్టి ఎంత ఉత్పత్తి పెరిగినా మనం ఇక్కడే విక్రయించుకోవడానికి ఆస్కారముంటుంది. తద్వారా రైతుకు ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు పడుతాయి.
‘నమస్తే’:కరీంనగర్ డెయిరీ పాలతోపాటు వివిధ రకాల స్వీట్లు అమ్ముతున్నది. మార్కెట్ నుంచి ఎటువంటి స్పందన ఉన్నది?
చైర్మన్: ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల పాలు వస్తున్నా కరీంనగర్ డెయిరీ పాలకు మంచి డిమాండ్ ఉంది. చాలా సందర్భాల్లో మేం డిమాండ్ మేరకు సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే కరీంనగర్ డెయిరీపై వినియోగదారులకు ఉన్న నమ్మకం అలాంటిది. ఆ నమ్మకానికి అనుగుణంగానే నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పాలను మార్కెట్కు అందిస్తున్నాం. పాలతోపాటు డెయిరీ తయారు చేస్తున్న దూద్పేడా, బటర్మిల్క్, కప్పులతో కూడిన పెరుగు, మ్యారేజ్ టబ్స్, పన్నీర్, టిన్స్లో నెయ్యి, ఫ్లేవర్డ్ మిల్క్, మలాయి లడ్డూ, కర్జురాకోవ లాంటి వాటి విషయంలోనూ మంచి స్పందన ఉంది. మున్ముందు మరిన్ని కొత్త రకం పదార్థాలను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
‘నమస్తే’: ఉమ్మడి జిల్లాలో పాడి పరిశ్రమను విస్తరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
చైర్మన్: ప్రస్తుతమున్న రైతులను బలోపేతం చేస్తూనే, కొత్తగా మరింత మందిని పాడి పరిశ్రమ వైపు ప్రోత్సహించాలి. పాడి లాభసాటి పరిశ్రమ అనేది చూపించాలి. అప్పుడే పాడి పరిశ్రమ వైపు రైతులు మొగ్గుచూపుతారు. పాడికి అలవాటు పడిన రైతు ఏ పరిస్థితుల్లోనూ మానకుండా చూసినప్పుడే కొత్త రైతులు వస్తారు. ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కరీంనగర్ డెయిరీలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. పాడి పశువుల కొనుగోలుకు 50వేల నుంచి 60వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నాం. పాడి పశువుల రవాణా చార్జీలో 75 శాతం రాయితీ ఇస్తున్నాం. ఏదేని కారణంతో పశువు చనిపోతే 5వేల నుంచి 7వేల ఆర్థిక సహాయం చేస్తున్నాం. పాడి పశువుల బీమాపై 50 శాతం సబ్సిడీ, రైతు ఇంటి వద్దనే ఉచిత వైద్యం అందించే సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇవేకాదు కృత్రిమ గర్భదానం, ఆడదూడలే జన్మించే వీర్యం సరఫరా, మినీ క్యాంపులు పెట్టి మందులపై సబ్సిడీ, అత్యవసర చికిత్సకు అంబులెన్స్, 50 శాతం సబ్సిడీపై టీకాలు, కల్యాణమస్తు కార్యక్రమం కింద పాడిరైతు కూతురు పెళ్లికి బంగారు పుస్తె వెండి మట్టెలు కానుకగా ఇస్తున్నాం. పాడి రైతు భరోసా స్కీంలో ఉన్న రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 50వేలు, పాడి రైతు సంక్షేమ నిధి కింద రుణం తీసుకున్న రైతు మరణిస్తే 30వేల ఆర్థిక సహాయం, విద్యా ప్రోత్సాహకాలు, పాలకేంద్ర భవన నిర్మాణాలకు చేయూత.. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. తద్వారా రైతులు పాడి పరిశ్రమ వైపు ఆసక్తి చూపుతున్నారు. డెయిరీతోపాటు లీటర్కు 4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తున్నది. వివిధ పథకాల కింద పాడి పశువులను ఇస్తున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలిచేది, వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఉండేది పాడిపరిశ్రమ మాత్రమే అన్నది ముఖ్యమంత్రి ఆలోచన. మా ప్రతి ఆలోచన, ఆచరణ అంతా ఆ దిశగానే సాగుతున్నది.
‘నమస్తే’: మార్కెట్లో ఐదు లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉందా..? ఆ పాలను విక్రయించే సౌకర్యం ఉందా..?
చైర్మన్: ఐదు లక్షలు కాదు, మరో ఐదు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేసినా మన రాష్ట్రంలో విక్రయించుకోవడానికి అవకాశమున్నది. ఉదాహరణకు ఒక్క హైదరాబాద్లో రోజుకు 20 లక్షల నుంచి 25 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉంటే.. అందులో 75 శాతం పాలు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతున్నవే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. ‘మన రాష్ట్రంలో మన పాలు’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలి అంటే ముందుగా వినియోగదారుల డిమాండ్కు సరిపడా పాల ఉత్పత్తి జరగాలి. అందుకే ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి పెంచడం వల్ల మన రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపినట్లవుతుంది. రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కరీంనగర్ డెయిరీ పాలకు హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉంది. రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది.