సకలజనులహితం కోసం కనీవినీ ఎరగని పథకాలు
అయినా బీజేపీ నేత ఈటల అబద్ధపు మాటలు
టీఆర్ఎస్ ఆదరణను చూసి ఓర్వలేక అక్కసు
తన రాజీనామా వల్లే అంటూ తప్పుడు ప్రచారం
మండిపడుతున్న హుజూరాబాద్ జనం
కరీంనగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సకల జనుల హితమే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ సర్కారు, ఆది నుంచీ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నది. కనీవినీ ఎరగని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. అందుకు నిదర్శనమే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. ఈ సెగ్మెంట్లో 2.91 లక్షల జనాభా ఉండగా, రైతుబంధు, దళితబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా.. ఇలా కేవలం నాలుగు పథకాల కిందే 1.51 లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నది. వీటితోపాటు మిగతా పథకాలను కలిపి చూస్తే రెండు లక్షలకుపైగా లబ్ధిదారులు ఉండగా, దాదాపు ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలం అందుతున్నది. కానీ, బీజేపీ నేత ఈటల రాజేందర్కు ఇదేమీ పట్టడం లేదు. ఏడేండ్లుగా అమలు చేస్తున్న పథకాలు కండ్ల ముందు కనిపించడం లేదు. తన స్వార్థం కోసం అసత్య ప్రచారాలు.. అబద్ధపు మాటలతో బురదజల్లేందుకు ప్రయత్నిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. తన రాజీనామా వల్లే ఇవన్నీ వస్తున్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తుండగా, హుజూరాబాద్ ప్రజానీకం మండిపడుతున్నది. ఈటల రెండు నాల్కల ధోరణి సరికాదని, తీరు మార్చుకోవాలని హితవు పలుకుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. అందుకు నిదర్శనమే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ఇంటింటికీ సర్కారు ఫలం చేరింది. రైతుబంధు, దళితబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు.. ఇలా ఈ నాలుగు పథకాల కిందే 1.51 లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నది. ఇంకా రైతుబీమా, రుణమాఫీ, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేనేత బీమా, కంటి వెలుగు వంటి అనేక పథకాల కింద నియోజకవర్గంలో రెండు లక్షలకుపైగా మందికి ఫలాలు అందుతున్నాయి. పార్టీలు, వ్యక్తులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఇంత గొప్పగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. కానీ, స్వప్రయోజనాలు, స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ నేత రాజేందర్ బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కారు సంక్షేమాన్ని విస్మరించిందని, అభివృద్ధి మాట మరిచిందని, ప్రజలను పట్టించుకోవడం లేదని, ఎన్నికలప్పుడే సమస్యలు గుర్తుకొస్తాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ తన రాజీనామా వల్లే వచ్చాయంటూ నమ్మించేందుకు యత్నిస్తున్నారు. ప్రతి విషయంలో ఆయన ద్వంద్వ వైఖరి, రెండు నాల్కల ధోరణి, స్వార్థ ప్రయోజనం, అసత్య ప్రచారం, ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు ఆయన రాజీనామా వల్లనే అయితే.. రాజీనామాకు ముందు రెండు లక్షలకుపైగా మందికి వివిధ పథకాల కింద జరిగిన, జరుగుతున్న లబ్ధికి కారకులెవ్వరో చెప్పాలన్న డిమాండ్ వస్తున్నది.
నాలుగు పథకాల కిందే 1.51లక్షల మంది..
బీజేపీ నేత ఈటల రాజేందర్ తన స్వప్రయోనాల కోసం ఎంతకైనా తెగిస్తారని, ఎన్ని అబద్ధాలైనా ఆడుతారని చెప్పడానికి టీఆర్ఎస్ సర్కారుపై చేస్తున్న విమర్శలే నిదర్శనం. నిజానికి కేసీఆర్ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ మానవీయ కోణంలో ముందుకెళ్తున్నారు. వృద్ధులు, పేదలు, అన్నదాతలకు అండగా నిలువాలన్న సంకల్పంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అందుకు నిదర్శనం హుజూరాబాద్లో అమలవుతున్న సంక్షేమ పథకాలే! మచ్చుకు చూస్తే.. నియోజకవర్గంలో రైతుబంధు కింద 63,409 మంది, ఆసరా కింద 37,737 మంది లబ్ధి పొందుతుండగా, దళితబంధు కింద ఇప్పటి వరకు 16,969 మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకపోతే అందరికీ అందేవి. అలాగే 24 గంటల ఉచిత విద్యుత్ కింద 33,859 మందికి లబ్ధి జరుగుతున్నది. ఈ నాలుగు పథకాలతోనే 1,51,974 మందికి ప్రయోజనం చేకూరుతున్నది. ఇక మిగిలిన పథకాలన్నింటినీ కలిపి చూస్తే.. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే రెండు లక్షలకుపైగా మందికి ప్రభుత్వ పథకాల ద్వారా మేలు జరుగుతున్నది.
రెండు నాల్కలు..
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో 94 వేలకుపైగా గృహాలుండగా 2.91 లక్షల జనాభా ఉన్నది. తాజా ఓటరు జాబితా ప్రకారం 2,36,283 మంది ఓటర్లున్నారు. అయితే, ప్రభుత్వ పథకాల ద్వారా మాత్రం రెండు లక్షలకుపైగా లబ్ధిపొందుతున్నారు. అంటే దాదాపు ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకం ఏదో ఒక రూపంలో వర్తిస్తూనే ఉందన్న విషయాన్ని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో మూడు నాలుగు పథకాలు కూడా వర్తిస్తున్నాయి. ఇదంతా కండ్లముందే కనిపిస్తున్నా ఈటల రాజేందర్ మాత్రం విషం కక్కుతున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని, ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారని, ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా, ఆసరా, రుణమాఫీ, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గొర్రెల పంపిణీ, చేనేత(థ్రిఫ్ట్) బీమా, కంటి వెలుగు, గురుకులాలు.. వంటి పథకాలు ఎక్కడివో చెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇన్నాళ్లూ ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్లోనే రెండు లక్షల మందికిపైగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నది తెలియడం లేదా..? ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కాదా..? ప్రజా సమస్యలను పరిష్కరించాలి.. ఆర్థికంగా చేయూతనివ్వాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు కావా..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం రాజేందర్ తన రాజీనామా వల్లే వచ్చాయని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే నీవు రాజీనామా చేయకముందు అమల్లో ఉన్న పథకాలకు నీకు సంబంధం లేదా? చెప్పాలని హుజూరాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గిట్ల ఆసరా ఎవలైతాన్రు..?
మాది గోపాలపురం. నా పెనిమిటి నన్ను ఆగం చేసి పోయిండు. నాకిద్దరు కొడుకులు. వాళ్ల బతుకు వాళ్లు బతుకుతాన్రు. నేనొక్క దాన్నే అయిపోయిన. భూములు.. జాగలు ఏం లేవు. కేసీఆర్ ఇచ్చే రూ.2016 పింఛన్ నాకు అసరా అయితాంది. ఎవరికీ చేయి చాపకుంట బతుకుతాన. ఇంతకుముందు ముసులోళ్లను గిట్ల ఎవలన్న పట్టించుకున్నరా? సీఎం కేసీఆర్ మాకు పెద్ద కొడుకు లెక్క. మాలాంటోళ్లకు ఆత్మగౌరవం కల్పించిండు. ఈ పథకాన్ని ఎవరో పరిగె అన్నరట. వాళ్లకు నోరెట్లచ్చింది. పైసలున్నోళకు మా బాధేం తెల్తది? అడ్డదిడ్డం మాట్లాడోళ్లకు బుద్ధి చెప్పాలె. లేకుంటే మళ్లో మాట అంటరు?
రంది లేకుంట సాగు చేస్తున్నం..
ఇదివరకు ఎట్లుండె? సీజన్ల పెట్టుబడి పైసల కోసం బ్యాంకుల సుట్టో లేదంటే వడ్డీ వ్యాపారుల సుట్టో తిరిగేది. ఎవుసం పనులు వదిలి ఎరువులు, ఇత్తనాల కోసం రోడ్డెక్కేది. నీళ్లు కూడా లేక పంటలు ఎండేది? కరెంట్ ఎప్పుడత్తదో.. ఎప్పుడు పోతదో తెలియకపోయేది? ఇవన్నీ ఇప్పుడున్నయా? సీఎం కేసీఆర్ రైతులకు అన్నీ చేయవట్టే. పెట్టుబడికి రందీ లేకుంట సీజన్కు ముందే రైతు బంధు పైసలు ఖాతాల్లో పడుతున్నయ్. నాకు ఐదెకరాల ఎవుసం భూమికి 50వేలు వత్తానయ్. ఇక ఎరువులు, విత్తనాలు ఎప్పుడంటే అప్పుడే దొరుకుతున్నయ్. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు పుష్కలంగా అత్తానయ్. 24 గంటల కరెంట్తో ఎప్పుడంటే అప్పుడు పొలానికి పోయి కరెంట్ పెడ్తానం. రంది లేకుంట ఎవుసం చేసుకుంటాన్నం. సీఎం కేసీఆర్ సారేమో రైతులకు అన్నీ చేస్తోంటే.. కేంద్రమేమో ధరలు పెంచుకుంట ఉసురుపోసుకోవట్టె. అన్నంపెట్టే రైతును గోస పెడ్తె మంచిది కాదు. సీఎం కేసీఆర్ సారును చూసైనా నేర్చుకోవాలె. రైతు పక్షపాతిగా ఉండాలె.
కేసీఆర్ సారే పెద్దదిక్కయిండు..
మాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది. ముగ్గురు కొడుకులు. ఎవుసం జేసుకొని పిల్లల్ని సాదుకున్నం. నా భర్త, నేను ఎవుసం జేసుకుంట కుటుంబం ఎల్లదీసుకున్నం. మంచిగ ఎవుసంజేసుకుంటున్న టైం ల నా భర్త నీల ఐలయ్య పానం సుస్తయ్యింది. ఆరునెల్లపాటు దవాఖాన్ల చుట్టు తిరిగినం. ఆయిన బతకాలని మస్తు అప్పులు జేసి దవాఖాన్ల ఖర్చు పెట్టినం. అయినా బతకలేదు. ఇంటి పెద్ద దిక్కు పానం పోయేసరికి భయమైంది. కుటుంబం ఎట్లా గడవాలె.. అప్పులు ఎట్లా దీరాలె అని రందివడ్డ. అంతల్నె ఆఫీసర్లు ఇంటికొచ్చిన్రు. మీ ఆయిన సచ్చిపోయిండు కదా రైతుబంధు కింద పైసలస్తయని కాగితాలు తీసుకొని పోయిన్రు. వారం రోజులైనంక సార్లు ఇంటికొచ్చి ఐదు లక్షల చెక్కు ఇచ్చిన్రు. అండ్లకెంచి 3లక్షలను బయటి నుంచి తెచ్చిన అప్పు కట్టిన. మిగిలిన రెండు లక్షలను పిల్లల చదువులకు, ఇంటి అక్కర్లకు వాడుకున్న. సీఎం కేసీఆర్ సారు ఐదు లక్షలు ఇయ్యకుంటే వడ్డీ పెరిగేది. అప్పుల కింద భూమి అమ్ముకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కొడుకులతో కలిసి ఉన్న భూమిల ఎవు సం జేసుకుంటున్నం. సీఎం కేసీఆరే నాకుటుంబానికి పెద్ద దిక్కయ్యిండు.