పట్టణ ప్రగతి నిధులతో పనులు
సాధ్యమైనంత తొందరలో అందుబాటులోకి
మార్కండేయనగర్లో బర్నింగ్ యంత్రం
కార్పొరేషన్, మే 6: బల్దియాల్లో వైకుంఠధామాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పట్టణ ప్రగతి, గ్రాంట్ల ద్వారా వచ్చిన నిధులతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సాధ్యమైనంత తొందరలో అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించిం ది. ఈ మేరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అన్ని మతాలకు చెందిన శ్మశాన వాటిలను అభివృద్ధి చేస్తున్నారు. చాలచోట్ల పనులు సగానికిపైగా పూర్తికాగా ఆరుచోట్ల తుది దశకు చేరాయి. ఇంజినీరింగ్ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.
సకల సదుపాయాలు..
శ్మశానవాటికల్లో సకల సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దహన సంస్కారాలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. వైకుంఠధామాల ఆవరణల్లో పచ్చదనం ఉట్టిపడేలా విరివిగా మొక్కలు నాటుతున్నారు. దహన వాటికలు, కర్మకాండల షెడ్లు, మహిళలు, పురుషులకు వేర్వురుగా సాన్నపు గదులతో పాటుగా పూర్తిస్థాయిలో నీటి వసతిని కల్పిస్తున్నారు. శ్మశానవాటికల్లో వస్తే మరుభూమికి వచ్చినట్లుగా కాకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రవేశ ద్వారాల సుందరీకరణకు ప్రాధాన్యతనిస్తున్నారు.
24 వాటికల అభివృద్ధి..
నగరంలో వివిధ నిధుల కింద వచ్చిన రూ. 11 కోట్లతో 24 శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే 6 శ్మశాన వాటికల్లో అభివృద్ధ్ది పనులు తుదిదశకు రాగా 10కి పైగా 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన వాటిల్లో పనుల్లో వేగం పెంచారు. మానేరు నది తీరంలోని శ్మశానవాటికలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో 3 దహన వాటికలు, రెండు స్నానాలగదులు, మూడు కర్మకాండ గదులు, మహిళలకు, పురుషులకు వేర్వురుగా మరుగుదొడ్లు నిర్మించారు. రుద్రభూమిగా భావించి శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మార్కండేయ నగర్లో బర్నింగ్ యంత్రం
నగరంలోని మానేరు డ్యాం సమీపంలో ఉన్న మార్కండయానగర్ శ్మశానవాటికలో నగరంలో ఎక్కడా లేని విధంగా బర్నింగ్ యంత్రం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం ఇప్పటికే ఈ వాటికలో ప్లాట్ప్లాం నిర్మిస్తున్నారు.ఇది అందుబాటులోకి వస్తే నగరవాసులకు ‘ఆఖరి’ చింత తీరే అవకాశాలుంటాయి.
బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలి..
నగరంలోని మార్కండయనగర్ శ్మశానవాటికలో మూడు రోజుల్లోగా క్రిమిటోరియం బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను నగర కమిషనర్ క్రాంతి ఆదేశించారు. గురువారం ఈ వాటికలో జరుగుతున్న అభివృద్ధి పనలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బర్నింగ్ ప్లాట్ఫాం పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత విపత్కర సమయంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ రామన్, డిఈ వెంకటేశ్వర్లు, ఎఈ నిఖిత తదితరులు పాల్గొన్నారు.