ఆన్లైన్లో పాఠాలు.. విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలన
ప్రభుత్వ విద్యాలయాలకు మరింత ఆదరణ
ఓదెల, ఆగస్టు 5: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విద్యాలయాలు ముందుకు సాగుతున్నాయి. ఆన్లైన్లోనూ పాఠాలు బోధి స్తూ.. విద్యార్థులకు ఇండ్లకు వెళ్తూ ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నాయి ఉపాధ్యాయ బృందాలు. ఈ క్రమంలో కొవిడ్ వేళలో సర్కార్బడులకు మరింత ఆదరణ పెరుగుతున్నది.
ఆన్లైన్ పాఠాలు ప్రైవేట్ పాఠశాలల్లోనే కాదు.. సర్కారీ బడుల్లోనూ అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధ్యాయులు. జూమ్ యాప్ ద్వారా పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులు దూరదర్శన్, టీ శాట్లోని విద్యా చానల్ ద్వారా విన్న పాఠాల్లో అనుమానాలపై జూమ్ యాప్ ద్వారా వివరిస్తున్నారు. పదో తరగతికి బోర్డ్ పరీక్షలు కావడంతో వారిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. అలాగే విద్యార్థుల ఇండ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారు చదువుతున్న తీరు, నోట్స్ను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులతో ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విధులను అంకితభావంతో పని చేస్తుండడాన్ని ఆయా గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు.
రెట్టింపైన విద్యార్థుల సంఖ్య..
కరోనా ప్రభావంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ మరింత పెరుగుతున్నది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కొనసాగకున్నా ఫీజులు గుంజుతుండడంతో ప్రభుత్వ పాఠశాలలే నయమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని సర్కార్ బడుల ఉపాధ్యాయులు కూడా చక్కగా వినియోగించుకుంటున్నారు. ఆన్లైన్ పాఠాలను పిల్లల ఇండ్లకు వెళ్లి పర్యవేక్షిస్తుండడం తల్లిదండ్రులను ఆకర్శిస్తున్నది. ఇందుకు ఓదెల మండలం కొలనూర్ ప్రాథమిక పాఠశాలనే నిదర్శంగా నిలుస్తున్నది. కొవిడ్ కంటే ముందు ఆ పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తు తం 100కు చేరింది. ఇటీవల ఉపాధ్యాయుల తీరును గమనిస్తున్న తల్లిదండ్రులు సర్కార్ బడుల్లో అడ్మిషన్ చేయిస్తున్నారు. దాదాపు అన్ని సర్కార్ బడుల్లో కొత్తగా అడ్మిషన్లు పెరగడం కనిపిస్తున్నాయి.
పూర్వ విద్యార్థుల తోడ్పాటు..
కొలనూర్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి, బడికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు తోడ్పాటు అందిస్తున్నారు. పాఠశాలకు రంగులు వేయించి, సామగ్రిని సమకూర్చారు. పేద విద్యార్థులు చదివే ఈ పాఠశాలలో నోట్ బుక్స్ అందజే స్తున్నారు. దీంతో కొలనూర్లోని హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇతర గ్రామాలకు ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తున్నది.