హుజూరాబాద్లో క్యాంపునకు పెద్దసంఖ్యలో దివ్యాంగులు
ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు 2200 మందికి పరీక్షలు
సందర్శించిన దివ్యాంగుల సహకార సంఘం చైర్మన్ వాసుదేవరెడ్డి
హుజూరాబాద్, ఆగస్టు 5 : హుజూరాబాద్ ఏరియా దవాఖానలో గురువారం నిర్వహించిన సదరం శిబిరానికి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు తెల్లవారుజాము నుంచే హుజూరాబాద్ బాట పట్టారు. బండ్లు, బస్సులు, ఆటోల్లో తరలివచ్చారు. అంచనాలకు మించి మంది వచ్చినా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. శిబిరంలో సకల సౌకర్యాలు కల్పించారు. నీడ కోసం టెంట్, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. వచ్చిన వారి కోసం కుర్చీలను సిద్ధం చేశారు. చెవి, ముక్కు, గొంతు, మానసిక వ్యాధులతో పాటు ఇతర అంగవైకల్యం ఉన్నవాళ్లకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. దాదాపు 2200 మందికి వైద్య సిబ్బంది ఓపికగా పరీక్షలు చేశారు. వీరందరికి సర్టిఫికెట్లు ఇంటికే పంపిచనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేశ్, ఆర్ఎంవో శ్రీకాంత్రెడ్డి, వైద్య బృందం తదితరులున్నారు.
నేడు జమ్మికుంటలో సదరం శిబిరం
జమ్మికుంట, 5 ఆగస్టు : జమ్మికుంట శుక్రవారం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జమ్మికుంట ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. చెవి, ముక్కు, గొంతు, కాళ్లు, చేతులు, నేత్రాలు, మానసిక వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సర్టిఫికెట్ ఇంటికే పంపిస్తమన్నరు..
నాకు ఏడాది కింద పక్షవాతం వచ్చింది. కాలు, చెయ్యి పనిచేయడంలేదు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్న. పనిచేసేందుకు శరీరం సహకరిస్తలేదు. ప్రభుత్వం పింఛన్ ఇచ్చేందుకు క్యాంపు పెడుతున్నారని తెలుసుకుని వచ్చిన. ఇక్కడ డాక్టర్లు నాకు పరీక్షలు చేసిన్రు. ఇంటికే సర్టిఫికెట్ పంపిస్తమని చెప్పిన్రు.