కరోనా నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ చర్యలు
వినియోగదారులకు సులభతర సేవలు
బిల్ రీడింగ్ కోసం ప్రత్యేక యాప్
క్లిక్ చేస్తే సెల్ఫోన్కు బిల్ మెసేజ్
ఆన్లైన్లోనే చెల్లింపునకు చాన్స్
కొత్తపల్లి/ వరంగల్ సబర్బన్, మే 5 :ప్రస్తుతం కరోనా భయపెడుతున్నది. ప్రతి ఒక్కరినీ చుట్టేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ మీటర్ల బిల్లుల నమోదు కష్టంగా మారింది. ఇటు రీడింగ్ చూసే సిబ్బందికి, అటు వినియోగదారులకు వైరస్ ముప్పు ఉండగా, ఇప్పటికే కొందరు సిబ్బంది కొవిడ్ బారిన పడడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సరికొత్త విధానాన్ని తెచ్చింది. వినియోగదారులే మీటర్ రీడింగ్ చేసి, బిల్లు కట్టునేందుకు టీఎస్ఎన్పీడీసీఎల్ యాప్ను తీసుకొచ్చింది. అందులో వివరాలు నమోదు చేస్తే సెల్ఫోన్కు బిల్ మేసేజ్ రానున్నది. ఈ విధానం ఒక్క మే నెలలోనే అందుబాటులో ఉండనున్నది.
ఎన్పీడీసీఎల్ మొత్తం 17 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థ పరిధిలో 61 లక్షల74 వేల 19 లోటెన్షన్(ఎల్టీ) విద్యుత్ మీటర్లు ఉండగా, మరో 3,211 హైటెన్షన్(హెచ్టీ) మీటర్లతో కలిపి మొత్తం 61లక్షల 77వేల 230 విద్యుత్ మీటర్లు ఉన్నాయి. అందులో 15 లక్షల 2వేల 974 వ్యవసాయ, హెచ్టీ విద్యుత్ కనెక్షన్లు మినహాయిస్తే మిగతా 60 లక్షల 51వేల 467 విద్యుత్ మీటర్లకు ప్రతినెలా స్పాట్ బిల్లింగ్ సిబ్బంది ఇండ్లకు వెళ్లి రీడింగ్ నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు చేసిన తర్వాత వినియోగదారుడు సమీప ఈఆర్వోలో క్యూలో నిల్చుని బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి బిల్లు కట్టాలి. అయితే ప్రస్తుతం కరోనా రక్కసి పొంచి ఉన్నది. ఈ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులు సులభంగా తమ ఇంటి మీటరు బిల్లును తామే రీడింగ్ తీసుకుని ఆన్లైన్లోనే చెల్లించేలా ఎన్పీడీసీఎల్ పేరుతో ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది.
యాప్ ఎలా పని చేస్తుందంటే..
ప్లేస్టోర్ నుంచి టీఎస్ఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను ఓపెన్ చేసి అందు లో సెల్ఫ్ రీడింగ్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సబ్ సెల్ఫ్ రీడింగ్ను ఎంచుకుని వినియోగదారుడి యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసిన కన్ఫర్మ్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ ఎంట్రీ చేసి కేడబ్ల్యూహెచ్పై క్లిక్ చేసి మీటర్ లోపల ఉండే కేడబ్ల్యూహెచ్ రీడింగ్ను స్కాన్ చేసే సమయంలో ‘భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ నొక్కితే మీరు ఈ నెలలో వినియోగించుకున్న బిల్లు మెస్సేజ్ రూపంలో వస్తుంది. ఈ బిల్లును ఆన్లైన్లో చెల్లించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే ఈ సెల్ఫ్ రీడింగ్ విధానం కరోనా తీవ్రంగా ఉన్న ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత పరిశీలిస్తారు. సెల్ఫ్ రీడింగ్ తీసుకోకుంటే స్పాట్ బిల్లింగ్ కార్మికులు కూడా వచ్చి రీడింగ్ తీస్తారు.
ఆన్లైన్ చెల్లింపులే మేలు..
కరోనా నేపథ్యంలో ఆయా కార్యాలయాలకు వెళ్లి బిల్లులు చెల్లించడం కంటే ఆన్లైన్లోనే చెల్లింపులే మేలు. ఎన్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా గాని పేటీఎం, ఫోన్ పే, బిల్ డెస్క్, ఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా గాని సులభంగా చెల్లించవచ్చు.
డైరెక్టర్లతో సీఎండీ ప్రత్యేక సమావేశం..
ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాలో తీసుకుంటు న్న కరోనా జాగ్రత్తలపై సీఎండీ అన్నమనేని గోపాల్రావు సంస్థ డైరెక్టర్లతో విద్యుత్భవన్లో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా ఉధృతి దృష్ట్యా ఉద్యోగు లు, వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ప్ర భుత్వ సూచనలు పాటించాలన్నారు. ఈ కీలక స మయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. కార్పొరేట్ కార్యాలయంతో పాటు సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో 24 గంటల పాటు నిరంతరంగా పనిచేసేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్యలు ఉన్నట్లయితే 1800 425 0028, 1912 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.