విద్యానగర్, ఆగస్టు 4 : కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, అప్రమత్తంగా ఉంటేనే వైరస్కు అడ్డుకట్ట వేయవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో బుధవారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్రావు, ప్రతినిధులతో కలసి విలేకరులతో మాట్లాడారు. కరోనా తరచూ రూపాంతరం చెందుతుందని, ఈ నేపథ్యంలోనే వేవ్లు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఇప్పటికే మనం మొదటి, రెండో దశలను చూశామని, మూడో వేవ్ ముప్పు రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డబుల్ మాస్క్లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని కోరారు. చేతులను సబ్బు, శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని, రెండు డోసులతోనే తగిన రక్షణ లభిస్తుందన్నారు. ప్రజలు గుమిగూడే ఫంక్షన్లు, సమావేశాలు, సభలు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. లక్షణాలు కనబడితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్గా తేలితే హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స పొందాలన్నారు. రోజువారీ కరోనా కేసుల పెరుగుదల థర్డ్వేవ్కు సంకేతంగా చెప్పవచ్చని ఐఎంఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎం వసంతరావు, పొలాస రాంకిరణ్ చెప్పారు. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు థర్డ్వేవ్ తీవ్రంగా ఉండవచ్చన్నా రు. డీఎంహెచ్వో డాక్టర్ జువేరియా మాట్లాడు తూ, జిల్లాలో 54.8 శాతం మందికి టీకాలు వేశామని తెలిపారు. మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. అవసరమైన పరికరాలు, మందులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సమావేశంలో వైద్యులు డీసీ తిరుపతిరావు, విజయలక్ష్మి, వెంకట్రెడ్డి, రవికుమార్,సురేశ్ పాల్గొన్నారు.