రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
అన్నదాన కార్యక్రమానికి హాజరు
కార్పొరేషన్, జూన్ 3: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టడం అభినందనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. లాక్డౌన్లో 11 రోజులుగా కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ-శ్రీనివాస్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం, సాయంత్రం అన్నదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం బస్టాండ్ చౌరస్తా వద్ద చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని వడ్డించారు. అనంతరం కార్పొరేటర్ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, లాక్డౌన్లో కార్మికులు, బస్టాండ్లో ప్రయాణికులు, దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగుల బంధువులకు భోజనం అందించడం ఆనందంగా ఉందన్నారు.
శివారు డివిజన్ల అభివృద్ధికి ప్రాధాన్యం
నగరంలోని శివారు డివిజన్ల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 21వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరై అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, లాక్డౌన్లో పేదలు, హమాలీలు, రైతులకు ఎంపీ సంతోష్కుమార్ భోజనం అందిస్తూ అండగా నిలుస్తున్నారని కొనియాడారు. లాక్డౌన్ ముగిసే వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమాల్లో మేయర్ వై సునీల్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనితాఆంజనేయులు, కార్పొరేటర్లు రాజేందర్రావు, శ్రీకాంత్, జంగిలి సాగర్, బోయినిపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, ఎంపీపీ వేణుగోపాల్, నాయకులు పురుషోత్తం, పొన్నం మధు, బొట్టు శ్రీనివాస్, వెంకట్, శ్యాం, బ్రహ్మం, ప్రవీణ్, తుల బాలయ్య, రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.