ధాన్యం కొనుగోలులో కీలక భూమిక
24 గంటల కరెంట్ ఇచ్చి మూతపడ్డ మిల్లులను తెరిపించినం
ప్రభుత్వానికి అండగా నిలవడం అభినందనీయం
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్/టౌన్, జూలై 2: ధాన్యం కొనుగోలు, దిగుమతిలో ప్రభుత్వానికి మిల్లర్లు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. భవిష్యత్లోనూ ఇదే తీరులో అండగా నిలువాలని అభిలషించారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించామని, ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. అధునాతన టెక్నాలజీని వినియోగించుకొని పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. హుజూరాబాద్లోని సిటీ గార్డెన్స్లో శుక్రవారం రైస్మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యేటేటా ధాన్యం దిగుబడి పెరుగుతుందన్నారు. గత యాసంగిలో 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా మిల్లర్ల సహకారంతో విజయవంతంగా కొనుగోళ్లు పూర్తిచేశామని చెప్పారు. ఉమ్మడి పాలనలో అరకొర కరెంట్తో మిల్లర్లు సతమతమయ్యారని గుర్తుచేశారు. వచ్చిన ఆదాయాన్ని జనరేటర్లకే వెచ్చించాల్సివచ్చేదన్నారు. దిక్కుతోచని స్థితిలో మిల్లును తెగనమ్ముకొని కుదేలయ్యారని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తుండడంతో ఈ సమస్యకు విముక్తి లభించిందన్నారు. రందిలేకుండా మిల్లులను నడుపుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
భూమికి బరువయ్యే పంట పండింది
కాళేశ్వరం జలాలు, 24గంటల కరెంటుతో ఈ యేడాది భూమికి బరువయ్యే ధాన్యం పండిందని, దీంతో అటు రైతులు, ఇటు మిల్లర్లు ఆనందంగా ఉన్నారని చెప్పారు. జపాన్కు చెందిన సటాక్ కంపెనీ ప్రతినిధులు తనను కలిశారని, అట్టి టెక్నాలజీతో కొత్త పరిశ్రమలు స్థాపించుకునేందుకు మిల్లర్లు ముందుకు వస్తే సహకరించేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నదన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని చెప్పారు. మిల్లర్ల సహకారంతోనే చైనా లాంటి దేశాలకు మనరాష్ట్రం నుంచే ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నామన్నారు. అయితే రాష్ట్రంలో చైనాకు ఎగుమతి చేసే బియ్యం సంబంధించిన పరిశ్రమలు మూడు మాత్రమే ఉన్నాయని, వాటి పెంపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జామీన్ లేకుండా ధాన్యం కేటాయింపు
గత ప్రభుత్వాలు కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లను జామీన్ అడిగేవారని, ఇప్పుడు మిల్లు సామర్థ్యాన్ని బట్టి 5 కోట్ల నుంచి 50 కోట్ల క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో మిల్లర్లకు 24 గంటల పని దొరికిందని, ఈ విషయంపై మిల్లర్లు సంతోషం చేస్తున్నారన్నారు.
పరిగే అనడానికి మనసేలా వచ్చింది?
ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు, పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి అనేక పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఇలాంటి అద్భుతమైన సంక్షేమ పథకాలను బీజేపీ నేత ఈటల రాజేందర్ ‘పరిగె’తో పోల్చి ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ఏడేండ్లు పదవులు అనుభవించిన ఆయనకు ఇలా మాట్లాడేందుకు మనసెలా వచ్చిందని నిలదీశారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారని, ఇప్పుడు అదే తరహాలో ఈటల కేసీఆర్కు వెన్నుపోటు పొడిచేందుకు కుట్ర చేశాడని మండిపడ్డారు.
మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తే సహించేది లేదు
మిల్లర్లను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మిల్లర్లు కూడా భయపడవద్దని, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
ఆత్మీయ భవనాలకు స్థలాలు.. నిధులు
ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రభుత్వం కుల సంఘాల ఆత్మీయ భవనాలకు స్థలం కేటాయించి వారంలోగా నిధులిస్తామని హామీ ఇచ్చారు. ఈటల దగ్గరికి వెళ్లిన కుల సంఘాల ప్రతినిధులకు కనీస సమయం కూడా ఇవ్వకుండా అవమాన పరచడం ఎంతవరకు సమంజసమన్నారు. పద్మశాలీ, గౌడ సంఘాలకు, హోటల్, మెకానిక్, ఆటో, రేషన్ డీలర్లు, సోడ, నాయిబ్రహ్మణ తదితర అసోయేషన్ నాయకులు తమను సంప్రదించారని వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ల హామీలు తప్పకుండా నెరవేరుస్తానన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, రైస్మిల్లర్లు నూక సంపత్, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రభాకర్రెడ్డి, రఘురామ రమేశ్, శ్రీనివాస్, శ్రీనివాస్, రాజిరెడ్డి, వేణు తదితరులున్నారు.
టీఆర్ఎస్కు రైస్ మిల్లర్ల మద్దతు..
త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో 120మిల్లులున్నాయని, ప్రత్యేక్షంగా పరోక్షంగా 20వేల వరకు ఓటర్లు ఉన్నారని, టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తూ స్వచ్ఛందంగా మద్దతు లేఖను మంత్రి గంగుల కమలాకర్కు అందజేసినట్లు రైస్మిల్లర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్లెపు మోహన్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్రావు, శంకర్లింగం, మల్లారెడ్డి తెలిపారు.
కేసీఆర్తోనే సాధ్యమైంది
సాగుతో పాటు పరిశ్రమలకు 24గంటల కరెంటు ఇవ్వడం కేసీఆర్తోనే సాధ్యమైంది. గతంలో అరకొర కరెంటుతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 24 గంటలు మిల్లులు నడుస్తున్నాయి. ఇటు మేము, అటు రైతులు సంతోషంగా ఉన్నారు.
ప్రభుత్వానికి అండగా ఉంటాం..
మిల్లర్లకు మేలు చేస్తున్న ఈ సర్కారుకు అండగా ఉంటాం. కేసీఆర్ చొరవతోనే మిల్లర్లకు 24 గంటల పని దొరికింది. మూత పడ్డ మిల్లులు తెరుచుకున్నవి. చేతినిండా పనిఉండడంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాం.
ఈటలను చూసి ఓటువేయలేదు
ఇప్పటి వరకు ఆరు సార్లు జరిగిన ఎన్నికల్లో ఈటల రాజేందర్ను చూసి ఓటు వేయలేదు. కేసీఆర్పై ఉన్న నమ్మకంతోనే కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ను గెలిపించినం. నియోజకవర్గంలో 15 నుంచి 20 వేల ఓట్లను మా తరఫున పార్టీకి వేయిస్తాం.