కలెక్టరేట్లు వేదికగా అధికారిక కార్యక్రమాలు
జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రులు కేటీఆర్, కొప్పుల, గంగుల, ప్రభుత్వ సలహాదారు రమణాచారి
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు
జిల్లాకేంద్రాల్లో కలెక్టర్లు
కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ):తెలంగాణ రాష్ట్ర ఏడో ఆవిర్భావ వేడుక నిరాడంబరంగా సాగింది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగింది. నాలుగు జిల్లాల్లోని కలెక్టరేట్ల వేదికగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించగా, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లిలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి జెండాలు ఎగురవేశారు. అంతకుముందు అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించగా, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పతాకాలు ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏడో ఆవిర్భావ వేడుక నిరాడంబరంగా సాగింది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగింది. నాలుగు జిల్లాల్లోని కలెక్టరేట్ల వేదికగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించగా, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లిలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి జెండాలు ఎగురవేశారు. అంతకుముందు అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించగా, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పతాకాలు ఆవిష్కరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉదయం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అంతకు ముందు నాఫ్స్ కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్డేతో కలిసి పాత బస్టాండ్ ప్రాంతంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అలాగే కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ జెండాను ఎగురవేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి హాజరయ్యారు. ముందుగా ఉదయం 8.45గంటలకు పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం 8.50 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. 8.55గంటలకు పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, 9గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. అలాగే పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ బండారి స్రవంతి పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జెండా వందనం చేశారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జెండా ఆవిష్కరించారు.
కరీంనగర్ కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ముందుగా అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో వేడుకలకు హాజరయ్యారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ కే శశాంకతోపాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సీపీ కమలాసన్ రెడ్డి, నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావు తదితరులు ఉన్నారు. అలాగే తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జెండా ఆవిష్కరించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో వేడుకలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కొత్త బస్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ రవితో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకున్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి ఆ తర్వాత జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ జి. రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు.