జ్యోతినగర్/కోల్సిటీ, ఆగస్టు 1: విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర సీఐటీయూ కమిటీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ పోరాటానికి గోదావరిఖనికి చెందిన సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం పలికారు. ఈ మేరకు ఆదివారం గోదావరిఖని నుంచి ర్యాలీగా రామగుండం రైల్వేస్టేషన్కు వెళ్లి, చలో పార్లమెంట్కు రైలులో బయలుదేరి వెళ్తున్న విశాఖ కార్మికులను కలిసి మద్దతు పలికారు. ఈ సందర్భంగా అల్పాహార భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకూ మరింత దిగజారుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసేందుకు వేగంగా ముందుకు వెళ్తుందన్నారు. విశాఖ స్టీల్ పరిశ్రమను కాపాడుకోవడం అందరి బాధ్యతన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎర్రవెల్లి ముత్యం రావు, తుమ్మల రాజారెడ్డి, మెండె శ్రీనివాస్, రామాచారి, కొమురయ్య, నాంసాని శంకర్, లక్ష్మారెడ్డి, నర్సయ్య, నాగమణి, ఉపేందర్, తుంగపిండి మల్లేశ్, వెంకటస్వామి, సారయ్య, కుమార్, నరహరి, వెంకన్న, భూమయ్య, ఆర్జీ-1,2,3 యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మేదరి సారయ్య, మెండె శ్రీనివాస్, వెంకన్న, విజయ్కుమార్రెడ్డి, కొమురయ్య తదితరులు ఉన్నారు.