హుజూరాబాద్, జమ్మికుంటలో పటాకులు కాల్చిసంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
హుజూరాబాద్/ జమ్మికుంట, ఆగస్టు 1: విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై అగ్రవర్ణ పేదల్లో హర్షం వ్యక్తమైంది. ఆదివారం సాయంత్రం జమ్మికుంట, హుజూరాబాద్లో సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చడంతోపాటు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటారు. 8 లక్షల లోపు ఆదాయం ఉన్న ఓసీ కులస్తులందరికీ రిజర్వేషన్లు అమలు చేస్తామనడం. ఐదేళ్ల వయసు సడలింపు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఓసీలు సంబురపడుతున్నారు. విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆదివారం రాష్ట్ర కేబినేట్లో నిర్ణయం తీసుకోవడంపై మురిసిపోతున్నారు. ఈ మేరకు హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పటాకలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నాలుగు రోజుల క్రితం ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొని సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించడం సంతోషకరమన్నారు. ఓసీ కులస్తులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న ఓసీ కులస్తుల వయస్సును విద్య, ఉద్యోగాల్లో ఐదేళ్లకు పెంచడం కేసీఆర్ ఉదార స్వభావానికి నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ భూమి, ఆస్తులకు సంబంధం లేకుండా 8లక్షల ల్లోపు ఆదాయం ఉన్న ఓసీ కులస్తులందరికీ రిజర్వేషన్లు అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. హుజూరాబాద్లో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, నాయకులు ఎడవెల్లి కొండాల్రెడ్డి, కౌరు సుగుణాకర్రెడ్డి, తాటిపెల్లి రాజన్న, పోరెడ్డి శంతన్రెడ్డి, వైద్యుల రజిత, గూడూరి ప్రతాప్రెడ్డి, కంకణాల వేణుగోపాల్రెడ్డి, దాసరి రమణారెడ్డి, మాసాడి సమ్మరావు, యాళ్ల సంజీవరెడ్డి, విష్ణుదాసు గోపాల్రావు, గూడూరి స్వామిరెడ్డి, తాడికల్ శ్రీనివాస్, గందె సాయి, పోలంపెల్లి శ్రీనివాస్రెడ్డి, చందాగాంధీ, రాజేశ్వర్రెడ్డి, విక్కీ, కంకణాల సరోజనరెడ్డి, వైద్యుల ముకుందారెడ్డి పాల్గొన్నారు. అలాగే జమ్మికుంటలోని తెలంగాణ చౌక్లో ఓసీ జేఏసీ నాయకులు పటాకలు కాల్చారు. జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, ఆర్య, వైశ్య సంఘం మండలాధ్యక్షుడు కే పాపయ్య పాల్గొన్నారు.
కేసీఆర్కు రుణపడి ఉంటం..
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో పాటు విద్య, ఉద్యోగాల్లో ఐదేళ్ల వయస్సు సడలింపు ఇచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం. అన్ని కులాల ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు టీఆర్ఎస్ సర్కారు కృషి మరువలేనిది. రిజర్వేషన్ అమలుతో ఓసీ కులస్తులకు మంచి రోజులు వచ్చాయి.
సద్వినియోగం చేసుకోవాలి..
విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేయడం సంతోషకరం. దీనిని ఓసీ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వ్యవసాయ భూమి, ఆస్తులకు సంబంధం లేకుండా రూ.8లక్షల ఆదాయం ఉన్న ఓసీ కులస్తులందరికీ ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం హర్షనీయం.