ప్రజలు అన్నీ గమనిస్తున్నరు
వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు
బండి సంజయ్కు మతిభ్రమించింది
ఎవరు అడ్డుకున్నా దళిత బంధు ఆగదు
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఇల్లందకుంట, ఆగస్టు 1: బీజేపీ ఆటలు ఇక సాగవని, అబద్ధాలు చెప్పడం, అసత్యప్రచారం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి, కారు పోతే కారు ఇస్తానని మాయమాటలతో ప్రజలను బండి సంజయ్ మోసం చేశాడని, అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లోని దళిత వాడల అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రూ.100 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, అందులో భాగంగా ఇప్పుడు రూ.77కోట్లు రాగా, సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయని వివరించారు. బీజేపీ నేత ఈటల కొత్త డ్రామాకు తెరలేపాడని, పాదయాత్రలో అస్వస్థతకు గురైనట్లు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెడితే ఆపేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని, కోర్టులో కేసులు వేస్తున్నదని దుయ్యబట్టారు. దళితులను బానిసలుగా చూసిన వ్యక్తి ఈటల అని, ఎవరు అడ్డుకున్నా దళిత బంధు ఆగదని, కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బండి సంజయ్కు మతిభ్రమించిందని, కేసీఆర్ ఫాంహౌస్ను లక్ష నాగళ్లతో దున్నుతామని, ప్రగతిభవన్ను పేల్చుతామని ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఉప ఎన్నికలో బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. క్యూ న్యూస్ మల్లన్న సైతం ప్రభుత్వంపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని, ఆయన్ను ఎర్రగడ్డ దవాఖానలో చేర్పించాలన్నారు. ఈటల తన అల్లుడి కాళ్లు కడిగిన పాపాన పోలేదు కాని, దళితులతో పాదాలకు పాలాభిషేకం చేసుకోవడమేమిటని ప్రశ్నించారు. ఇక్కడ ఎంపీటీసీ మోటపోతుల ఐలయ్య, మాజీ ఎంపీటీసీలు నేరెళ్ల కుమారస్వామి, రాంస్వరణ్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కనుమల్ల గణపతి, కుమార్, వెంకటేశ్, తారక్, దామోదర్, పాషా, తిరుపతి, అశోక్, లాల్మహ్మద్ పాల్గొన్నారు.